
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఆన్లైన్లోనే నిర్వహించాలన్న ఆలోచనకు ఉన్నత విద్యా మండలి వచ్చింది. దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యే ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ తదితర సెట్స్ అన్నింటిని రాత పరీక్ష రూపంలో కాకుండా, ఆన్లైన్లోనే నిర్వహిం చేందుకు కసరత్తు చేస్తోంది. 2017–18 విద్యా సంవత్సరంలోనే ఈ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని భావించినా అమలు చేయ లేదు.
ఒక్క ఈసెట్ను ఆన్లైన్లో నిర్వహిం చినా గందరగోళం నెలకొంది. ఆన్లైన్ ప్రాసెస్ సంస్థ పొరపాట్లు, అధికారుల సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పకడ్బందీగా నిర్వహించే సంస్థకే ఆన్లైన్ పరీక్షల బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అన్ని సెట్స్నూ విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2018–19లో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సెట్స్ను ఆన్లైన్లో నిర్వహించే బాధ్యతలను టీసీఎస్కు అప్పగిం చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
జేఈఈ మెయిన్ ద్వారా భర్తీపై చర్చ
రాష్ట్రంలో కొన్ని టాప్ కాలేజీల్లో మినహా మిగతా వాటిల్లో ఇంజనీరింగ్కు డిమాండ్ పడి పోయింది. లక్షకు పైగా సీట్లకు ఆమోదం తెలిపినా 80 వేలకు మించి భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలను అధికారులు చేశారు. దానికంటే జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తే బాగుంటుందని భావించారు. అయితే జాతీయ స్థాయి సిలబస్ కలిగిన జేఈఈ మెయిన్కు సిద్ధం అయ్యే విద్యార్థుల స్థాయి, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల స్థాయి మధ్య తేడా చాలా ఉంటుందన్న అంచనాకు వచ్చా రు. దీంతో ఎంసెట్ నిర్వహణ తప్పనిసరి అన్న ఆలోచనకు వచ్చారు.
వచ్చే ఏడాదీ ఎంసెట్తోనే..
రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా ఇంజనీరింగ్ ప్రవే శాలను ఎంసెట్ ద్వారానే చేపట్టను న్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఇంజనీరింగ్ పరీక్ష అంశం ఖరారు కానందున.. ఎంసెట్ ద్వారానే రాష్ట్రంలో 2018–19లో ప్రవేశా లను చేపడతామని వెల్లడించారు.