భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో బతకమ్మ వేడుకలను ఘనంగా బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు ఈఓ టి.రమేష్బాబు, డీఈ రవీందర్ తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో మహిళలు బతకమ్మలను ఆడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా దేవస్థానం తరఫున ఒక బతకమ్మను సిద్ధం చేస్తున్నట్లు వారు చెప్పారు. బతకమ్మ ఉత్సవం, శరన్నవరాత్రులను పురష్కరించుకుని బుధవారం నుంచి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి ఆలయంలో శరన్నవరాత్రులు ప్రారంభం
రామాలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు అలంకరిస్తారు. ఆదిలక్ష్మీ, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి అలంకరణలో వరుసగా లక్ష్మీతాయారు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 9.30గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం, ఉదయం 7 నుంచి 11గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు శ్రీరామయణ పారాయణం, ఉదయం. 10.30 నుంచి 11గంటల వరకు సంక్షిప్త రామాయణ హోమం, మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు శ్రీ లక్ష్మీతాయారు సన్నిధిలో సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 6.30 నుంచి 7.30గంటల వరకు విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాదగోష్టి, రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు శ్రీ వారి తిరువీధి సేవ ఉంటాయని తెలిపారు.
అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ పారాయణాల కొనసాగుతాయి. విజయదశమి, రామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా అక్టోబర్ 10న ఉదయం 11.30 గంటలకు శ్రీరామ మహాపట్టాభిషేకం, పట్టణంలోని దసరా మండపంలో సాయంత్రం 4గంటలకు శమీ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం ఉంటాయి.
రామాలయంలో నేటి నుంచి బతకమ్మ వేడుకలు
Published Wed, Sep 24 2014 2:22 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement
Advertisement