
సూపర్‘ఫిట్’
44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో ఆర్టీసీలో సంబురాలు
తీన్మార్ నృత్యాలతో కార్మికుల జోష్
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
ఎనిమిదో రోజు సాయంత్రం నుంచి రోడ్డెక్కిన బస్సులు
ప్రయాణికులకు తొలగిన రవాణా ఇక్కట్లు
ఎంసెట్ అభ్యర్థులకు ఊరట
సమ్మె నష్టం రూ.4 కోట్ల పైమాటే
ఆర్టీసీ సమ్మె ముగిసింది. ప్రభుత్వం నుంచి సూపర్ ఫిట్మెంట్ ప్రకటన రావడంతో ఆర్టీసీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిరసనలు చేసిన చోటే కార్మికులు సంబురాలు జరుపుకొన్నారు. రంగులు చల్లుకొన్నారు. డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిపారు. ఇదంతా బుధవారం సాయంత్రం నుంచి చోటుచేసుకున్న పండుగ వాతావరణం.
అదే సమయంలో బస్సులు సైతం రోడ్డెక్కడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిది రోజులపాటు బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దాదాపు రూ.4 కోట్ల నష్టం ఏర్పడింది. ఇక నుంచి కష్టపడి పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామంటున్నారు కార్మికులు. - సాక్షి, సంగారెడ్డి
ఎనిమిది రోజులుగా సాగిన ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక శాతం అధికంగా ఫిట్మెంట్ ప్రకటించటంతో అప్పటి వరకు ఉద్యమాల్లో ఉన్న జిల్లాలోని ఏడు డిపోల ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. మధ్యాహ్నం తరువాత ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆందోళన విరమించి సాయంత్రం నుంచి సంబరాల్లో మునిగిపోయారు. కార్మికులు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ, టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.
డిమాండ్లను నెరవేర్చిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. టీఎంయూ, టీఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, బీఎంఎస్ నాయకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్కు రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో సంస్థ పటిష్టానికి కష్టపడి పనిచేస్తామంటున్నారు.
సంగారెడ్డిలో కార్మికులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. డ్యాన్స్లు, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. గజ్వేల్, దుబ్బాక, మెదక్, దుబ్బాక డిపోల్లో సైతం ఆర్టీసీ కార్మికుల వేడుకల్లో పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో వారు కూడా సంబరాలు జరుపుకొన్నారు.
ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, ఎంసెట్ అభ్యర్థులు
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో ప్రయాణికులు, ఎంసెట్ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఎంసెట్ ఉండడంతో పరీక్షకు ఎలా వెళ్లాలో తెలియక అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం.. కార్మికులు సమ్మె విరమించడం బుధవారం చకచకా జరిగిపోయాయి.
సమ్మెతో రూ.4 కోట్ల నష్టం
మెదక్ రీజియన్లో ఎనిమిది రోజులుగా సాగిన సమ్మె కారణంగా సంస్థకు రూ.4 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 600కుపైగా బస్సు లు ఉన్నాయి. ఆయా బస్సుల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.50 లక్షల వరకు ఆదా యం వస్తుంది. 8 రోజుల సమ్మె కారణంగా సంస్థ రూ.4 కోట్లకుపైగా ఆదాయా న్ని కోల్పోయింది. సమ్మెకారణంగా ప్రయా ణికులు కూడా ఇబ్బందులు పడ్డారు.