ఆ మార్గంలో జెట్‌ స్పీడ్‌.. | CRRI Spot Death Spots on ORR Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ మార్గంలో జెట్‌ స్పీడ్‌..

Jun 3 2019 7:12 AM | Updated on Jun 3 2019 7:12 AM

CRRI Spot Death Spots on ORR Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు... అతి వేగమే కారణమంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ వేగానికి కళ్లెం వేసే చర్యలను మాత్రం తీసుకురావడం లేదు. ‘ఎక్స్‌ప్రెస్‌ వేపై డైరెక్షనల్‌ మార్కింగ్‌ స్పష్టంగా కనపడాలి. ఇంటర్‌ చేంజ్‌లు, ర్యాంప్‌లు, మీడియం లేన్, సోల్డర్‌ లేన్‌ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చ’ని న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని అమలు చేయడంలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలు జరిగే 29 ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని అధ్యయనం చేసి, నిర్వహణా లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చేసిన సూచనలను గాలికొదిలేశారు. ఓఆర్‌ఆర్‌ మార్గంలో రోజుకు లక్షా 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నా భద్రత విషయంలో అధికారుల అలసత్వ ధోరణిపై విమర్శలు వస్తున్నాయి.

వేగ నియంత్రణపై శ్రద్ధ ఏదీ?..
కార్లు, లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్, హెవీ ట్రక్కులు సీఆర్‌ఆర్‌ఐ అధ్యయనం చేసిన 29 ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కార్లు గంటకు 108 నుంచి 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్లుగా సీఆర్‌ఆర్‌ఐ రిపోర్టులో పేర్కొంది. 30 నుంచి 50 శాతం కార్లు, 7 శాతం లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్, 1 శాతం భారీ ట్రక్కులు అతి వేగంతో వెళుతున్నట్లుగా గుర్తించారు. ఈ పరిస్థితితో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో కర్వ్‌లు, గ్రాండెంట్‌ సెక్షన్లు, ట్రాన్స్‌వర్స్‌ బార్‌ మార్కింగ్, మీడియన్‌ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్‌ మార్క్‌లు, స్పీడ్‌ అరెస్టర్స్‌ ఏర్పాటు చేయడంతో వేగాన్ని నియం త్రించవచ్చని సీఆర్‌ఆర్‌ఐ ప్రతిపాదించింది. అయితే వీటిని ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

‘టిపికల్‌’ ప్రమాదాలపై నిర్లక్ష్యం...
చాలా వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్‌ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్‌ఆర్‌ అంతటా మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్‌ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని, ఇవన్నీ తక్కువ ఎత్తు ఉండటంతో వాహనాలు వాటిని ఢీకొని అవతలవైపు ఎగిరిపడుతున్నాయని సీఆర్‌ఆర్‌ఐ పేర్కొంది. దీని నియంత్రణకు ‘టిపికల్‌ డబుల్‌ మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌’ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసినా ఆ పనుల్లో పురోగతి మాత్రం కనపడటం లేదు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ వేలో డైరెక్షనల్‌ మార్కింగ్‌లు వాహనదారులకు స్పష్టంగా కనబడేలా చూడాలని చెప్పగా, ఆ మేరకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు. ‘రాత్రి సమయాల్లో వాహనదారుల భద్రత కోసం ఎడ్జ్‌ స్టడ్స్, లేన్‌ డివైడర్‌ స్టడ్స్‌ అవసరముంది. ఎక్స్‌ప్రెస్‌ వే కుడివైపు లేన్, మీడియన్‌ సైడ్‌ను తెలుపు రంగుతో మార్కింగ్‌ చేయాలి. అలాగే కుడివైపున రోడ్డు స్టడ్స్‌ను ఎరుపు రంగులో, మీడియన్‌ సైడ్‌ లేన్‌ పసుపు రంగులో మార్క్‌ చేయాలి. ఎక్స్‌ప్రెస్‌ వే హైస్పీడ్‌ వయోలేషన్స్‌ కుడివైపు, మీడియం లేన్లు రెడ్‌ కలర్‌ స్టడ్స్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేసే ర్యాంప్‌ల్లో చెవ్రాన మార్కింగ్‌ చేయడంతో పాటు బొల్లార్డ్స్‌ను ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ‘నో స్టాపింగ్, నో పార్కింగ్, నో ఓవర్‌ టేకింగ్‌’సూచన బోర్డులు ఏర్పాటు చేయాలి. ఎగ్జిట్, ఎంట్రీ ప్రాంతాల వద్ద 8 నుంచి 10 మిల్లీమీటర్లు మందంగా పెయింట్‌ను రోడ్డు స్టడ్స్‌కు వేయాలి. వేగాన్ని నియంత్రించేందుకు బొల్లార్డ్స్‌ కూడా ఏర్పాటుచేయాలి’అని సీఆర్‌ఆర్‌ఐ చెప్పింది. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక అధ్యయనం చేయించి మరీ తీసుకున్న సూచనలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా కొంత మేర రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మార్గంలో జెట్‌ స్పీడ్‌..
ఒక్క శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి మార్గంలో కార్లు 139 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఓఆర్‌ఆర్‌పై 69 కి.మీ., 137 కి.మీ., 88 కి.మీ. వద్ద వాహనాలు అతివేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. శామీర్‌పేట నుంచి కీసర మార్గంలో లియోనియా రిసార్ట్‌ సమీప ప్రాంతంలో కార్లు వాయు వేగంతో వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇక్కడ కార్లు 180 నుంచి 208 కిలోమీటర్ల వేగంతో, లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ 111 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా గుర్తించారు. అతి వేగంతో వాహనం నడిపే డ్రైవర్లు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ‘ఎక్స్‌ట్రీమ్‌ లెఫ్ట్‌లో ఉన్న రెండు లేన్లపై లారీలు వెళ్లడటం ఉత్తమం. ఎక్స్‌ట్రీమ్‌ రైట్‌ మీడియన్‌కు పక్కన ఉండే లేన్‌లో అధిక వేగంతో గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లాలి. మూడో లేన్లలో తక్కువ వేగంతో అంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లేలా చూడాల’ని సీఆర్‌ఆర్‌ఐ చేసిన ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement