
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోపన్పల్లిలో దళితుల భూములను లాక్కున వ్యక్తి రేవంత్ అని.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. 111 జీవో పరిధిలో ఎరెవరికి భూములున్నాయో బయటపెడతామన్నారు. రేవంత్రెడ్డి చూపించిన భూములు కేటీఆర్వి కావని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. (కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి)
సంచలనాలు కోసమే..
సంచలనాలు కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడతారని, అలాంటివారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీకి ఇలాంటి నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులమంతా ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రజలంతా ఒక్క వైపు ఉంటే.. రేవంత్ బృందం అంతా ఓ వైపు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మానుకోవాలని రేవంత్కు ఆయన హితవు పలికారు. (జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ)
వేల కోట్లు ఎలా సంపాదించారు..
బ్లాక్మెయిల్కి కేరాఫ్ అడ్రాస్గా రేవంత్రెడ్డిని పీయూసీ ఛైర్మన్ జీవన్రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం కూడా చెప్పారని, అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పెయింటర్గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్.. వేల కోట్లు ఎలా సంపాదించారని జీవన్రెడ్డి ప్రశ్నించారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు..
ప్రపంచం మెచ్చిన నేత కేటీఆర్ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసు చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా అని సిగ్గుపడ్డామన్నారు. ఉప్పల్లో నువ్వు కొనుగోలు చేసిన భూముల సంగతి ఏమిటని రేవంత్ను ప్రశ్నించారు. వాటిని బయటపెడితే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. పీసీసీ పదవి కోసమే ఆయన ఆరోపణలు చేస్తున్నారని సైదిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment