
చేర్యాలలో ప్లకార్డులతో ఆకాంక్షను తెలుపుతున్న యువకులు
సాక్షి, జనగామ : పోరాటాలకు పురుడు పోసుకున్న ‘జనగామ’ మరో ఉద్యమానికి ఊపిరి పోస్తుందా.. ఇందుకు నిదర్శనం ‘సాక్షి’ లో ‘జిల్లాలోకి మూడు మండలాలు?’ అనే శీర్షికన ప్రధానంగా ప్రచురితమైన కథనం జనగామ, సిద్దిపేట జిల్లాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ‘సాక్షి’లో వచ్చిన కథనంపైనే చర్చించుకున్నారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే సోషల్ మీడియాలో సాక్షి వార్తాకథనం చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. జనగామతో పాటు నియోజకవర్గంలోనే ఉన్న ప్రస్తుత సిద్దిపేట జిల్లా పరిధిలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లిలో హాట్టాపిక్గా మారిపోయింది.
వాట్సప్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియాలో జనగామ జిల్లాలో మూడు మండలాలు కలవబో తున్నాయా అంటూ మాట్లాడుకోవడం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ ప్రతిపాదనలు తీసుకు రావడం, లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒకే జిల్లాలో ఉండాలనే నిబంధన ఉండడంతో ‘మూడు మండలాల’ కలయిక చర్చకు వచ్చింది. జనగామ జిల్లా కేంద్రంలో నాటి జిల్లా ఉద్యమకారులకు సాక్షి కథనం ఊపిరిపోసినట్లుగా మారింది.
మూడు మండలాల కోసం మరోఉ ద్యమం చేద్దామంటూ ముందడుగు వేస్తున్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేసే సమయంలో చేర్యాల, మద్దూరు మండలాలను కలపాలని విశ్వప్రయత్నం చేశారు. భౌగోళికంగా చరిత్ర పరంగా నాటి నుంచి ఒక్కటిగా ఉన్న ప్రాంతాలను విడదీ యవద్దని వేడుకున్నారు. తెలంగాణ సాయుధ పోరా>టం, భైరాన్పల్లి వీరోచిత ఘటనలు ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అలాంటి ప్రాంతాన్ని రెండు ముక్కలు చేయడంతో ప్రజలు ఆవేదనకు గురయ్యారు. మళ్లీ ఒక్కటయ్యే అవకాశం రావడంతో ఈ సారి జనగామలో కలవాలనే పట్టుదలతో ఉద్యమ కార్యాచరణ ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధం
జనగామ జిల్లాలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను విలీనం చేయాలని అన్ని పార్టీల నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు కాటం శ్రీధర్, తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, రాచమల్ల శ్రీనివాస్, రాళ్లబండి భాస్కర్, కాటం శ్రీకాంత్, విజయ్, కిషన్, సత్తెయ్య ప్రసాద్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
లోక్సభ నియోజక వర్గాల పరిధిలోని మండలాలను ఒకే జిల్లాలో కలపాలి, చేర్యాలను రెవెన్యూ డివిజన్తో పాటు నియోజక వర్గ కేంద్రంగా చేసి పూర్వవైభవాన్ని తీసుకురావాలని తీర్మానించుకున్నారు. జనగామ నియోజకవర్గంలో కొనసా గుతూనే జిల్లాపరంగా సిద్దిపేటలో కలిసి గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేటకు పనుల నిమిత్తం తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్దూరు మండల పరిస్థితి మరీ అధ్వానం. ఇక్కడి ప్రజలు రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలన్నా మూడు నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో జిల్లాల పునర్విభజన సమయం నుంచే మద్దూరువాసులు జనగామలో కలపాలని కొట్లాట చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల అండతో..
మూడు మండలాలను జనగామ జిల్లాలో విలీనం చేసేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనలో అక్క డి రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లను కలుపుకుని ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్కు వివరిం చేలా ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు కాక ముం దే సిద్దిపేట జిల్లాలో ఉన్న మూడు మండలాలను జనగామలో కలిపేందుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్లు అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment