
గొప్పల కోసమే 'ఆసరా' పథకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 4 లక్షల 60 వేల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
మహిళలు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వెల్లడించారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికి పింఛన్లు అందేవరకు పోరాడతామని చెప్పారు. అలాగే పింఛన్ల అంశంపై సభలో చర్చ చేపట్టేందుకు తాము పట్టుబడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.