పార్టీలో కుట్ర జరుగుతోంది: బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీపై ఆపార్టీకే చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు రాజాసింగ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై రాష్ట్ర బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు పదవులు కట్టబెట్టారని, నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ కమిటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది అనుకుంటే, పార్టీ నుంచి తొలగించమని లక్ష్మణ్ను లేఖ ద్వారా కోరారు.
కాగా గత నెలలో తెలంగాణలో అమిత్ షా పర్యటన సందర్భంగా కూడా రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువని.. ఈ గ్రూపుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు.