
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల మంత్రి కేటీఆర్ చెప్పారు. బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు జరుపుతున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2017– 18లో రూ.1,270 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో చేనేత రంగంపై కేటీఆర్ ప్రకటన చేశారు. ‘రాష్ట్రంలో 16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాలు ఉన్నాయి.
నేతన్నల సామాజిక, ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే థ్రిఫ్ట్ పథకానికి రూ.60 కోట్లు విడుదల చేశాం. ఈ పథకంతో ఇప్పటివరకు 6,445 మంది నేతన్నలు లబ్ధి పొందారు’అని వివరించారు. ‘చేనేత సహకార సంఘంలోని సొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీని 40 శాతానికి పెంచాం. దీనికి కేంద్ర ప్రభుత్వ 10 శాతం సబ్సిడీ అదనం. ఈ పథకం కోసం రూ.100 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ వివరించారు. రూ.14.98 కోట్లతో గద్వాలలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment