
నస్రుల్లాబాద్: పేగు బంధం ఎంత గొప్ప దో.. దాని కోసం ఎంతటి కష్టమైనా భరించేందుకు తల్లిదండ్రులు తపన పడ్డారో చా టి చెబుతోంది ఈ ఘటన. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన సూర్ భాగ్యలక్ష్మి, అంజయ్య దంపతులు సొంతూళ్లో ఉపాధి లేక ఇద్దరు కూతుళ్లను స్వగ్రామంలో తమ తల్లిదండ్రుల వద్ద ఉంచి, హైదరాబాద్కు వలస వెళ్లారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆ దంపతులకు పని కరువైంది. ఇంతలో కూతురు అనారోగ్యానికి గురైందని, శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రికి తీసుకువెళ్లారని తెలిసింది.
దీంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు కూతురును చూడాలన్న తపనతో కాలినడకన అయినా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం నడక ప్రారంభించి మెదక్ జిల్లా చేగుంట వరకు సుమారు 70 కిలోమీటర్లు ఏకబిగిన నడిచారు. అక్కడ ఓ లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇవ్వడంతో మంగళవారం మధ్యాహ్నానికి కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిని, కొద్దిసేపు సేదతీరి తిరిగి నడక ప్రారంభించారు.
అయితే, ఎర్రటి ఎండలో కాలినడకన వెళుతున్న వీరిని గాంధారి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కానీ తమ పరిస్థితిని పోలీసులకు వివరించడంతో బాన్సువాడ వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్లో వారిని ఎక్కించి పంపించారు. జక్కల్దాని తండా వరకు అంబులెన్స్లో వెళ్లిన వీరు అక్కడి నుంచి కాలినడకన నస్రుల్లాబాద్కు చేరుకున్నారు. ఇలా సుమారు 120 కిలోమీటర్ల దూరం నడిచి తమ కూతురు వద్దకు చేరుకున్నారు.
చదవండి:
భారీ ర్యాలీ అని భ్రమపడేరు!
మరో ఉద్దీపనపై కేంద్రం కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment