కన్నతండ్రే కాలయముడు | Missing children of professor found murdered | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలయముడు

Published Tue, Oct 7 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

కన్నతండ్రే కాలయముడు

కన్నతండ్రే కాలయముడు

సాక్షి, హైదరాబాద్: కన్న తండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా పెంచాల్సిన చేతులతోనే కర్కశంగా ఇద్దరు కొడుకుల ప్రాణాలు తీశాడు. ఆనక తన  ప్లాట్ ప్రాంగణంలోనే గోతిలో పూడ్చిపెట్టాడు. ఆపై రైలు కింద పడి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ ఆత్మహత్య ఉదంతంలో క్రూరమైన కోణం వెలుగుచూసింది. అదృశ్యమయ్యారని భావించిన పిల్లలు విఠల్ విరించి(9), నందవిహారి(5)లను గురుప్రసాదే పక్కా పథకంతో హత్య చేసినట్టు తేలింది. చిన్నారుల అదృశ్యంపై 56 గంటల పాటు సాగిన మిస్టరీ చివరికి తండ్రి సెల్‌ఫోన్‌లోని ఎస్‌ఎంఎస్ ఆధారంగా వీడింది. భార్యపై కోపంతోనే ప్రొఫెసర్ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.
 
 అసలేం జరిగింది..?
 శనివారం ఉదయం 9 గంటలకు మల్కాజ్‌గిరిలో ఉంటున్న భార్య సుహాసిని నుంచి విఠల్ విరించి, నందవిహారిలను గురుప్రసాద్ బైక్‌పై తీసుకెళ్లాడు. 10.30 గంటలకు మేడ్చల్‌కు చేరుకున్నాడు. అంతకు ఒకరోజు ముందే మేడ్చల్‌లోని కల్పతరు వెంచర్‌లో తనకున్న 300 గజాల సొంత ప్లాట్‌లో శవాలను పూడ్చిపెట్టేందుకు పెద్ద గొయ్యి తీయించి పెట్టాడు. ఈ గొయ్యి వద్దకు వెళ్లాక అక్కడే ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. అనంతరం ఒకే గొయ్యిలో ఇద్దరు పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టాడు.

అక్కడ్నుంచి తిరిగి బైక్‌పై 11.30కి బయల్దేరి మల్కాజ్‌గిరిలోని సుహాసిని వద్దకు వచ్చాడు. కోర్టు కేసు పూర్వాపరాల గురించి ఆమెతో మాట్లాడాడు. పిల్లల గురించి ఆమె నిలదీయడంతో గుడిలో భోజనం చేస్తున్నారని, చేయగానే తీసుకువస్తానని వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి నేరుగా సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని అందరూ చూస్తుండగానే ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన సెల్ నుంచి సుహాసిని సెల్‌కు "see bodies in medchal'  (మృతదేహాలను మేడ్చల్‌లో చూడు) అని మెసెజ్ చేశాడు. అయితే ఆ ఎస్‌ఎమ్మెస్ సుహాసిని సెల్‌కు చేరలేదు.
 
గురుప్రసాద్ సెల్‌ఫోన్‌లోని డ్రాఫ్ట్ బాక్స్‌లోనే ఉండిపోయింది. పిల్లల గురించి మల్కాజ్‌గిరి ఇన్‌స్పెక్టర్ శేఖర్‌గౌడ్ ఆరా తీస్తున్న క్రమంలో ముందుగా గురుప్రసాద్ సెల్‌ఫోన్ టవర్‌పై దృష్టి సారించారు. శనివారం ఉదయం పిల్లల్ని తీసుకెళ్లాక అతను మేడ్చల్‌కు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. దీంతో పిల్లల కోసం పోలీసులు మేడ్చల్ వైపు దృష్టి సారించారు. గురుప్రసాద్ సెల్‌ఫోన్‌ను సోమవారం సాయత్రం 5 గంటలకు పోలీసులు మరోసారి నిశితంగా పరిశీలించారు. డ్రాఫ్ట్‌బాక్స్‌లోని మెసేజ్‌ను చూసి షాకయ్యారు. అందులో ఉన్నమేరకు మేడ్చల్‌లోని గురుప్రసాద్ ప్లాట్‌లో పరిశీలించగా గొయ్యి తీసిన ఆనవాళ్లు కనిపించాయి.

శామీర్‌పేట ఎమ్మార్వో రాత్రి 7 గంటల సమయంలో పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. పిల్లల తలపై గాయాలు కనిపించాయి. మెడ వెనక భాగంలో కత్తితో కోసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఘటనా స్థలంలో కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గొంతు పిసికి హత్య చేశాడా లేక తలపై కొట్టి హతమార్చాడా అనేది పోస్టుమార్టం అనంతరం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
 
పథకం ప్రకారమే..
 మేడ్చల్‌లోని తన సొంత ప్లాట్ (ఖాళీస్థలం)లోనే పథకం ప్రకారం ఒక రోజు ముందే ఆరు అడుగుల లోతు, మూడు అడుగుల వెడల్పు, ఐదు పొడవుతో గొయ్యి తీయించాడు. పిల్లల్ని గొయ్యి వద్దే హత్య చేసి పూడ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా పెద్ద కొడుకు మృతదేహం, ఆపై చిన్న పిల్లవాడి మృతదేహాన్ని వేసి మట్టితో కప్పివేశాడు. ఒక్కడే మట్టి కప్పాడా లేక ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గొయ్యి తవ్విన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్‌లోని కూలీ అడ్డాపై ఉన్న కొందర్ని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో విరించి 4వ తరగతి, విహారి యూకేజీ చదువుతున్నారు.


ఆసుపత్రిలో సుహాసిని
పిల్లలు ఇక లేరని తెలియగానే తల్లి సుహాసిని కుప్పకూలిపోయింది. ఆమెను మల్కాజ్‌గిరిలో ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 10 గంటలకు ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో గాంధీ మార్చురీకి వచ్చిన సుహాసిని తన పిల్లల మృతదేహాలను చూసి బోరున విలపించింది. ‘పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. వాడు తండ్రి కాదు రాక్షసుడు’ అంటూ రోదించింది. గురుప్రసాద్ మృతదేహానికి గాంధీలో ఆదివారం రాత్రి 10 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసి తల్లి అనసూయ భాయ్‌కి అప్పగించారు. స్వస్థలం కడపలో సోమవారం అంత్యక్రియలు జరిగాయి.
 
 కుటుంబ నేపథ్యం ఇదీ..
గురుప్రసాద్ శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్‌లో పదేళ్లుగా సైన్స్ ప్రాఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కెమిస్ట్రీలో నిష్ణాతుడు. పలు అంతర్జాతీయ మేగజైన్లకు వ్యాసాలు రాశాడు. భార్య సుహాసిని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కలతలతో గతేడాది విడిపోయాక ఆమె పిల్లలతో కలిసి మల్కాజ్‌గిరిలోని పుట్టింట్లో ఉంటోంది. గురుప్రసాద్ అల్వాల్‌లోని బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు, మల్కాజ్‌గిరి కోర్టులో వరకట్న వేధింపుల కేసు నడుస్తున్నాయి.
 
గృహహింస చట్టాన్ని సవరించాలి:  కేంద్ర హోంశాఖకు గురుప్రసాద్ లేఖ
ఆత్మహత్యకు ముందు గురుప్రసాద్ రాసిన మూడు లేఖలను పోలీసులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘‘పిల్లలు నీ దగ్గరుంటే బ్రతకలేరు.. వాళ్లను ఎప్పుడు కోపగించుకుంటావ్... కొడతవ్... విడాకులొద్దు. కలిసే ఉందాం’’ అని భార్యకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. గృహహింస చట్టంతో పాటు అందులోని 498 ఏ సెక్షన్‌ను సవరించాలని కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో కోరాడు. సుహాసిని తీరుపై ఇన్ఫోసిస్ చైర్మన్‌కు ఇంకో లేఖ రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement