
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారులకు రెవెన్యూ శాఖ కొమ్ముకాస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. లంచం తీసుకుంటూ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వకుండా సచివాలయంలోని రెవెన్యూ అధికారులు కేసులను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆయన వినతిపత్రం సమర్పించారు. అవినీతి కేసుల్లో పట్టుబడ్డ అధికారులను ప్రాసిక్యూషన్ చేయకుండా అడ్డుకోవడం, తీవ్ర నేరారోపణలున్నా శాఖాపరమైన చర్యలకే పరిమితం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో సుమారు 50 అవినీతి కేసులను విచారణ జరపకుండానే మూసివేశారని, దీనిపై విచారణ జరపాలని కోరారు.