
సోలార్ ప్యానెల్తో బ్యాటరీ రీచార్జి చేస్తున్న దృశ్యం
ఆకలి, అవసరం ఉన్న మనిషికి అన్ని నేర్పిస్తాయని అంటుంటారు
ఆదిలాబాద్ ,జైనథ్: ఆకలి, అవసరం ఉన్న మనిషికి అన్ని నేర్పిస్తాయని అంటుంటారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది కూడా అలాంటి కోవకు చెందిన ఉదాహరణే అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ సంచార కుటుంబం గ్రామ గ్రామాన తిరుగుతూ..తమకు వచ్చిన మూలిక వైద్యాన్ని అందిస్తుంటారు. చెట్ల కింద చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ముందర ఓ చిన్న చెట్టు కింద కొన్ని రోజులుగా వాళ్లు బస చేస్తున్నారు.
అయితే వీరు ఎక్కడకు వెళ్లినా ఓ సోలార్ ప్యానెల్, బ్యాటరీ వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఇదే విషయమై వారిని అడగగా తమకు గ్రామాల్లో కరెంట్ సదుపాయం ఎవరూ ఇచ్చే వారు కాదని దీంతో ఎనిమిది నెలలక్రితం రూ.8 వేలు పెట్టి ఓ సోలార్ ప్యానెల్, ఒక బ్యాటరీ కొనుగోలు చేసామన్నారు. సాధారణంగా ఇదే సోలార్ ఇన్వర్టర్ కొనుగోలు చేస్తే కనీసం రూ.30 వేలు ఖర్చు అవుతాయి. వీరు మాత్రం చిన్న ప్యానెల్తో బ్యాటరీని రీచార్జ్ చేస్తూ.. దాని నుంచి ఒక టీవీ, ఒక బల్బ్, ఒక మైక్సెట్ నడిపిస్తున్నారు.. ఇది చూసిన చాలా మంది ఇలాంటిది కొనుగోలు చేసుకుంటే అసలు కరెంట్ సమస్యనే ఉండదు కదా అని చర్చించుకుంటున్నారు.