ఈ నెల 12వ తేదీన అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని మసీదుల వద్ద దావత్-ఏ- ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి
రాంనగర్ : ఈ నెల 12వ తేదీన అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని మసీదుల వద్ద దావత్-ఏ- ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో శాసనసభ నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశములో ఆయన మాట్లాడారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మసీదుల వద్ద 1,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు ఇమామ్, మసీద్ మేనేజ్మెంటు సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి దావత్-ఏ- ఇఫ్తార్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది పేద కుటుం బాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.500 విలువైన దుస్తులు పంపిణీ చేయతలపెట్టామని, ఈ దుస్తులను వక్ఫ్ బోర్డు సీఈఓ ద్వారా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్ఓ రవి, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, జెడ్పీ సీఈఓ మహేందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు, డీఆర్డీఏ అడిషనల్ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.