వరంగల్: గొర్రెల కాపరి రైలు పట్టాలు దాటుతుండగా మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. నెక్కొండ మండలం పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన కడారి భీమయ్య(55) గొర్రెలను పట్టాలు దాటించి తను దాటే క్రమంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వరంగల్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భీమయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
(మట్టెవాడ)