
'దమ్ముంటే రాజీనామా చేసినట్లు ప్రకటించాలి'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్కి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ఎన్నికలకు తలసాని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాజీనామాను ఆమోదింప చేసుకోవట్లేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.