రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో కొనసాగిన దాడులు | IT Raids Continued For 2nd Day At TRS Minister Mallareddy Houses | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు

Published Thu, Nov 24 2022 2:48 AM | Last Updated on Thu, Nov 24 2022 3:07 PM

IT Raids Continued For 2nd Day At TRS Minister Mallareddy Houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌/రసూల్‌పుర/మేడ్చల్‌:  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. వైద్య కళాశాలల్లో సీట్లకు నిర్దేశిత ఫీజు కంటే అధిక మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుని రియల్‌ ఎస్టేట్‌కు, సూరారం ఆసుపత్రికి తరలించినట్లు బయటపడింది. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడం, ఆస్పత్రిలో చేరడం, ఈ విషయం తెలిసి ఐటీ అధికారులను, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను నెట్టేసి మంత్రి ఆస్పత్రికి వెళ్లడం, కుమారుడిని చూడనీయలేదంటూ అక్కడ ధర్నాకు దిగడం, మహేందర్‌రెడ్డిని జవాన్లు చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం, ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మంత్రి ఇంటికి తీసుకురావడం.. తదితర పరిణామాలతో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రివరకు తనిఖీలు కొనసాగుతుండగా, గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నామని, ఆస్తులు, కాలేజీల వివరాలన్నీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. సోదాలు గురువారం ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

ఆస్పత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి 
ఐటీ దాడులు కొనసాగుతుండగా.. మంత్రి కుమారుడు మహేందర్‌ రెడ్డికి ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరారు. మరో బంధువు ప్రవీణ్‌రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరి సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. మంత్రి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిట్స్‌తో అనారోగ్యానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రిలో చేరారని టీవీల ద్వారా తెలుసుకున్న మంత్రి తన నివాసం నుంచి.. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులను, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను నెట్టేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడటం, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు జవాన్లు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

నన్నూ, సీఎంను బద్నాం చేయాలని చూస్తున్నారు.. 
     ‘మేము దొంగలమా..దొంగ వ్యాపారం చేస్తున్నామా..? కేసినో నడిపిస్తున్నామా.? హవాలా దందా చేస్తున్నామా..? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామా.? తక్కువ మొత్తంతో పేద పిల్లలకు ఎంబీఏ, ఇంజనీరింగ్‌ విద్య అందిస్తున్నాం. మేము ఏమైనా అవినీతికి పాల్పడితే.. కేసులు పెట్టుకోండి. మా ఇళ్లు వేలం వేయండి.. స్వాధీనం చేసుకోండి..? కానీ మమ్మల్నెందుకు క్షోభకు గురి చేస్తున్నారు? కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఎవరి దగ్గరో డబ్బు దొరికితే దానిని నాతో ముడిపెట్టడం ఏమిటి? నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. నేను టీఆర్‌ఎస్‌ మంత్రిని కావడం వల్లనే దాడులు చేస్తున్నారు. వందల మంది అధికారులతో  దాడులు చేయడం ఏమిటి? నా కొడుకు ఛాతీపై కొట్టారు. వాడు తీవ్రంగా భయపడుతున్నాడు. వాడికి ఏమైతుందోనని భయంగా ఉంది. సోదాల్లో ఏమీ దొరకకపోయినా ప్రధాని నరేంద్రమోదీ మాపై కక్షతో వ్యవహరిస్తున్నారు..’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడినుంచి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని ఇంటికి వచ్చిన తరువాత ఆయన కోడలు ప్రీతిరెడ్డిని కూడా ఐటీ అధికారులు తీసుకొచ్చారు. మెడికల్‌ కాలేజీల వ్యవహారం ఆమె చూస్తారని చెబుతున్నారు. ఇలావుండగా    మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలను చూసే సంతోష్‌రెడ్డి కొంపల్లి నివాసంలో ఐటీ అధికారులు దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకుని ఐటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. సంతోష్‌రెడ్డి డిలీట్‌ చేసిన కంప్యూటర్‌ డేటాను రిట్రీవ్‌ చేసినట్లు సమాచారం.   

కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి 
    కక్ష సాధింపులు మంచివి కాదని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఓపికతో ఉన్నామని, కానీ ఐటీ అధికారుల తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, ఎల్‌.రమణలు విమర్శించారు. సూరారం ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ.. బహిరంగంగా వ్యాపారాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని టార్గెట్‌ చేసి, ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు.  

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం 
    మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను నిరసిస్తూ కంటోన్మెంట్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లారెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.  

మర్రి రాజశేఖర్‌రెడ్డి లాకర్లపై దృష్టి..
మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన లాకర్లపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయనకు ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం టర్కీలో ఉండటంతో మంత్రి కూతురు శ్రేయారెడ్డిని తీసుకెళ్లి లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు. అందులో నాలుగు లాకర్లను తెరిచినట్లు ఐటీ అధికార వర్గాల సమాచారం. కాగా లాకర్లలో పెద్దయెత్తున నోట్ల కట్టలు కనుగొన్నట్లు తెలిసింది. రూ.4 కోట్ల నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డి గురువారం నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement