
సాక్షి, సిరిసిల్ల : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. రక్షణ విధుల్లో పోలీసుల అమరత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రక్తంచిందింది. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు దాకా జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులున్నారు. అసాంఘిక శక్తులను కట్టడి చేసే క్రమంలో తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. కల్లోల ఖిల్లాగా పేరున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో దశాబ్దకాలం కిందల నక్సలైట్లు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీసులు విధి నిర్వహణలో నక్సలైట్ల చేతుల్లో ప్రాణత్యాగాలు చేసి అమరత్వం పొందారు.
జిల్లాలో సంఘటనలు
- 1991లో ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శ్రీనివాస్రావు అనే హోంగార్డును నక్సలైట్లు గాంధీ విగ్రహం వద్ద హతమార్చారు.
- 1994లో అక్టోబర్ 28న గంభీరావుపేట మండలకేంద్రంలో అప్పటి ఎస్సై సాబీర్ఖాన్ను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన నమాజ్కు వెళ్లి వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు.
- 1996లో కోనరావుపేట మండలం నిజామాబాద్ శివారులో మావోయిస్టు నక్సలైట్లు కల్వర్టు కింద మందుపాతర పేల్చగా మోహన్రావు, నజీరోద్దీన్ అనే కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు.
- 1997లో కోనరావుపేట ఎస్సై ఎం.శ్రీనివాస్గౌడ్ను ఎగ్లాస్పూర్ గుట్టల్లో మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు.
- 1997 సెప్టెంబర్ 7న చందుర్తి ఎస్ఐ శ్రీనివాస్రావును లింగంపేట– రుద్రంగి మధ్య మందుపాతర పేల్చి హతమార్చారు.
- 1999లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద తిరునగరి శ్రీనివాసచారి అనే హోంగార్డును మావోయిస్టు నక్సలైట్లు హతమార్చారు.
- 2003 ఫిబ్రవరి 11న కోనరావుపేట మండలం వట్టిమల్ల వద్ద కొడిమ్యాల పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే హెంకు నాయక్, కృష్ణ అనే పోలీసు కానిస్టేబుళ్లను జనశక్తి నక్సలైట్లు కాల్చిచంపారు.
Comments
Please login to add a commentAdd a comment