
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిట్ఫండ్ సంస్థల మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో చిట్ఫండ్స్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిన్నచిన్న మొత్తాలు దాచుకున్న ప్రజలను పలు సంస్థలు సులువుగా మోసం చేస్తున్నాయని, డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలపై నిఘా ఉండేలా నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. మోసపూరిత సంస్థల నుంచి తిరిగి డబ్బు వసూలుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టమే లేకుండాపోయిందన్నారు. మోసాలు జరిగిన తరువాతే చట్టాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. చిట్ఫండ్ సంస్థల మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో, ఇలాంటి మోసాలకు తావివ్వకుండా పటిష్ట వ్యవస్థ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment