ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షాలు కురిసినప్పటికీ గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాంతాల్లోకి నీరు చేరలేదు. ఓవైపు ఖమ్మం జిల్లా భద్రాద్రి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంటే.. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద మాత్రం ఇప్పటికీ ఎడారినే తలపిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పుష్కరాలకు నీళ్లు కరువయ్యే పరిస్థితి తలెత్తింది.
ఎగువన మహారాష్ట్రలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నదిలో వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ నీటి మట్టం కూడా అంతగా పెరగలేదు. ప్రస్తుతం 1,057.6 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులో కనీసం మత్తడి లేవల్ వరకు కూడా నీరు రాలేదు. ఎస్సారెస్పీకి 80 శాతం క్యాచ్మెంట్ ఏరియా మహారాష్ట్రలో ఉంది. సుమారు ఐదు శాతం కర్నాటకలో ఉండగా, మిగిలిన 20 శాతం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉంటుంది.
ఈ రెండు జిల్లాలో వారం రోజులుగా కొంత మేరకు వర్షపాతం నమోదైనప్పప్పటికీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. రానున్న పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే జూలై 14 నుంచి ప్రారంభం కానున్న పుష్కర స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. జూలై మొదటి వారం తర్వాతే నీటిమట్టం విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
పుష్కరాలకు నీళ్ల కరువు
Published Fri, Jun 26 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement