![Atishi seeks 15 days police patrolling for water pipeline in Delhi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/16/atishi.jpg.webp?itok=FM8Vnhzl)
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.
‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.
మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.
‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.
నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment