
వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఇటీవలి వర్షాలతో హైదరాబాద్లో అంత భయంకరమైన పరిస్థితి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. హైదరాబాద్లోని పరిస్థితిని అతిగా చూపించి నగరానికి చెడ్డపేరు తీసుకురావొద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. తాజా భారీ వర్షాలకు మనిషి కాదు ఒక్క జంతువు కూడా చనిపోలేదని ఆయన పేర్కొన్నారు.
అక్రమ కట్టడాల వల్లే నగరంలో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముసి నది నాలాలపై 28వేల అక్రమ కట్టడాలను గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. ఈ అక్రమ కట్టడాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయన్నారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని, ఎంతటి వారికి చెందిన కట్టడాలైనా ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. నగరంలో 400 పురాతన భవనాలు అధికారులు కూల్చివేశారని, అందువల్లే ప్రాణనష్టం తప్పిందని చెప్పారు.
శతాబ్దంలోనే అత్యధిక వర్షం
హైదరాబాద్లో సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం 84మిల్లీమీటర్లని, కానీ ఇప్పుడు 468 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. గత వందేళ్లలో సెప్టెంబర్లో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలిపారు. 338 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని, 448శాతం అధికంగా వర్షం పడిందని తెలిపారు. అసాధారణ వర్షాలు వచ్చినప్పుడు చిన్నిచితక సమస్యలు చుట్టుముట్టడం సాధారణమేనని చెప్పారు. వర్షాల సమయంలో హైదరాబాద్ అధికారులు చాలా సమర్థంగా పనిచేశారని వారికి అభినందనలు తెలిపారు. విశ్వనగరం రాత్రికి రాత్రే కాదని చెప్పారు. చెన్నైతో పోలిస్తే హైదరాబాద్కు జరిగిన నష్టం చాలా తక్కువ అని చెప్పారు. హైదరాబాద్లో పాడైన రోడ్లు కూడా చాలా తక్కువేనని తెలిపారు. నగరంలో త్వరలోనే రోడ్ల విస్తీర్ణం చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇచ్చి.. సాయం కోరతామని చెప్పారు.