
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు.
ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment