
‘పిరికిపందల చర్య.. వాళ్ల ఆట కట్టిస్తాం’
రాయ్పూర్: కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి మావోయిస్టుల పనిపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. నిరాశ, నిస్పృహతోనే మావోయిస్టులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆయన నివాళి అర్పించారు. మావోయిస్టుల దాడి పిరికిపందల చర్యగా ఆయన వర్ణించారు.
‘ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మన అమర జవాన్ల బలిదానం వృధా కాదు. మావోయిస్టుల దాడులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంద’ని రాజ్నాథ్ అన్నారు. మావోయిస్టుల సమస్యపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల అధికారులతో మే 8న సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎల్ డబ్ల్యూఈ వ్యూహాన్ని సవరించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా అమర జవాన్లకు నివాళి అర్పించారు. దక్షిణ బస్తర్లోని సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.