ఈసీ కొరడా: ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నికల కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఈసీ.. రాత్రి 10:30 తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది.
విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.