
2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఎస్పీ దోస్తీ: ఆజాద్
కాంగ్రెస్, ఎస్పీల కూటమి 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు.
కాన్పూర్: కాంగ్రెస్, ఎస్పీల కూటమి 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, ఇతర లౌకిక పార్టీలు కూడా ఇందులో చేరతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. బీఎస్పీ కూడా ఈ మహా కూటమిలో చేరుతుందా? అని అడిగినపుడు.. బీజేపీతో పోరాడటానికి తమతో కలిసిరావాలని అన్ని లౌకిక పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. యూపీలో లౌకిక పునాదులు బలోపేతం కావాలంటే కలసిసాగాలని కాంగ్రెస్, ఎస్పీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీచేస్తే బీజేపీ 10–15 సీట్లకే పరిమితమవుతుందని చెప్పారు. మోదీ ప్రధాని అయినా కూడా ఆ హోదాకు తగిన పరిపక్వత ఆయనలో లోపించిందని ఆరోపించారు. బహుశా అందు వల్లే ఆయన ప్రసంగాలు దిగజారుతున్నాయని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఎస్పీ కూటమికి తిరుగులేదని, ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన చోట్లలో తొలిస్థానంలో ఉందని పేర్కొన్నారు. చివరికి కనీసం 275 సీట్లు గెలిచి అఖిలేశ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.