తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎలకన గూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు మంగళవారం సాయంత్రం దాడి చేసినట్లు సమాచారం.
దుమ్ముగూడెం(ఖమ్మం): తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎలకన గూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు మంగళవారం సాయంత్రం దాడి చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురు దాడికి దిగడంతో ఇరువురు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే, రాత్రి వరకు కాల్పులు జరిగినా.. ఎవరికీ గాయాలు కానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ధర్మపేట బేస్ క్యాంపు ఏర్పాటైనప్పటీ నుంచి క్యాంపును అక్కడి నుంచి తొలగించాలని మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
వివిధ రూపాలలో దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ, పోలీసులు కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బేస్క్యాంపులు ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులు బేస్ క్యాంపులను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. కానీ, కిష్టారం, ఎలకన గూడాలలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. దీంతో బేస్క్యాంపులకు నిత్యావసర సరుకులు అందకుండా చేయాలనే ఉద్దేశంతో సంతలను నిలిపివేశారు. అప్పటి నుంచి క్యాంపులపై దాడులు చేస్తారని పోలీసు నిఘా వర్గాలు పసికట్టి క్యాంపులకు అధిక బలగాలను తరలించారు. అయినప్పటికీ మావోలు ఎలకన బేస్ క్యాంపు పై దాడికి పాల్పడ్డారు.