న్యూఢిల్లీ : మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)పై సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 2014 ప్రారంభంలో రూ. 450 కోట్ల మేర పన్ను నోటీసులు అందుకున్న సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయడంలో కంపెనీ జాప్యం చేసినందుకు గాను ఈ పెనాల్టీ విధించింది. 2009-10 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి నోటీసులను ఆదాయ పన్ను శాఖ 2014 ఫిబ్రవరిలోనే ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు మే లో తెలియజేసింది ఎన్డీటీవీ. ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశంలో కంపెనీ .. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సెబీ అడ్జుడికేటింగ్ అధికారి ప్రసాద్ జగ్దలే ఈ మేరకు జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.