విచారణలో సహకరిస్తున్న తరుణ్!
ఉదయం 10.30 గంటల నుంచి సుదీర్ఘంగా సిట్ విచారణ
సిట్ కార్యాలయానికి చేరుకున్న ఉస్మానియా బృందం
హైదరాబాద్: టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ను సిట్ విచారిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి తరుణ్ను ఎడతెగకుండా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి చక్రపాణితో కలిసి శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో తరుణ్ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. డ్రగ్స్ డీలర్ కెల్విన్తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఇంకా ఆ డ్రగ్స్ లింక్స్ కొనసాగిస్తున్నారా? మీరు ఏమైనా పబ్లు నిర్వహిస్తున్నారా? పబ్లలో డ్రగ్స్ అమ్మడం సర్వసాధారణమేనా? వంటి ప్రశ్నలను సిట్ అధికారులు తరుణ్ను అడిగినట్టు తెలుస్తోంది. సినీ పరివారంలో పబ్ కల్చర్ గురించి హీరో తరుణ్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో తరుణ్ సహకరిస్తున్నారని సిట్ అధికారులు చెప్తున్నారు.
గతంలో సొంతంగా పబ్ నిర్వహించిన తాను ఆరేళ్ల కిందటే ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పానని తరుణ్ చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఏ పబ్లోనూ తాను పార్ట్నర్గా కొనసాగడం లేదని ఆయన తెలిపారు. కాగా, తరుణ్ విచారణలో భాగంగా ఉస్మానియా వైద్యుల బృందం సిట్ కార్యాలయానికి చేరుకుంది. తరుణ్ రక్త నమూనా, తల వెంట్రుకలు, గోళ్లు వైద్యబృందం సేకరించింది. వీటిని పరీక్షించడం ద్వారా తరుణ్ డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా? అన్నది వైద్యబృందం నిర్ధారించనున్నట్టు సమాచారం.
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను వరుసగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించింది. ఈ కేసులో సిట్ విచారణను ఎదుర్కొన్న నాలుగు సినీ ప్రముఖుడు తరుణ్. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోందని, సోమవారం హీరో నవదీప్ సిట్ విచారణకు హాజరుకానున్నారని, ఈ నెల 26న విచారణకు హాజరవుతామని హీరోయిన్ చార్మీ చెప్పిందని సిట్ అధికారులు వెల్లడించారు.