
రూ.3కు బ్రేక్ఫాస్ట్.. రూ.5కు భోజనం!
లక్నో: తమిళనాడులో విజయవంతమైన అమ్మా క్యాంటిన్ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నపూర్ణ భోజనాలయ పేరుతో పేదలకు తక్కువ ధరకు బ్రేక్ ఫాస్ట్, రెండు పూటలా భోజనం అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. 3 రూపాయలకు బ్రేక్ ఫాస్ట్, 5 రూపాయలకు భోజనం అందించాలని యోచిస్తున్నారు.
ఈ పథకానికి తుది మెరుగులు దిద్దే బాధ్యతను యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, సురేష్ ఖన్నాలకు అప్పగించారు. యూపీ రాజధాని లక్నోతో పాటు కాన్పూర్, ఘజియాబాద్, గోరఖ్పూర్లలో సబ్సిడీ క్యాంటీలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, 8 రూపాయలకు భోజనం అందిస్తున్నారు.