
నేతన్నలనూ మోసగించారు
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత మేరుగ ధ్వజం
ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?
తక్షణమే చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్
హైదరాబాద్: ప్రతి అంశానికీ మసిపూసి మాయ చేస్తూ నిత్యం ప్రజలందర్నీ మోసగించే సీఎం చంద్రబాబునాయుడు చేనేత కుటుంబాలనూ అదేతీరున మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటామని ఎన్నికలముందు వందలకొద్దీ హామీలిచ్చి, ఇప్పటివరకూ అందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ‘చేనేత’ దినోత్సవం రోజున ప్రజలంతా చేనేత వస్త్రాలు వాడాలని పిలువునివ్వడం వారిని మోసం చేయడం కాదా? అని పార్టీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేనేతలను నిర్లక్షం చేసినందునే వందలమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమూ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.312 కోట్ల చేనేతల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించి, ఆ ఫైలుపై సంతకం కూడా చేశారు.
ఆయన మరణాంతరం సీఎంలైన వారెవరూ దాన్ని అమలు చేయనందున ఇప్పుడు చేనేతల అప్పు రూ.1000 కోట్లకు పెరిగిపోయింది. మొన్నటి ఎన్నికల ముందు కూడా చేనేత అప్పుల్ని అణాపైసలతోసహా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి వారిని మోసం చేశారు’’ అని ఆయన దుయ్యబట్టారు. ‘‘అధికారంలోకి రాగానే నేతన్నలకు గుర్తింపు కార్డులిస్తామన్నారు.. చేనేత భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.. జరీపై విధించిన వ్యాట్ రద్దు చేస్తామన్నారు.. కార్మికులకు బ్యాంకురుణాల మాఫీ.. పవర్లూమ్లపై ఉన్న రుణాలు రద్దు చేస్తామన్నారు.. ఒక్కొక్క నేత కుటుంబానికి లక్షన్నర సంస్థాగత రుణం ఇస్తామన్నారు.. ఇలా ఎన్నో హామీలిచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు అమలు చేయలేదు?’’ అని ప్రశ్నించారు. తక్షణమే చేనేత రుణాల్ని అణాపైసలతో మాఫీచేయాలని, పేద, చేనేతల ఆత్మహత్యలను ఆపాలని నాగార్జున డిమాండ్ చేశారు.