గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షను ఉద్దేశించి ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షపై సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మూడు బృందాలుగా వైద్యులు వచ్చి గత ఐదు రోజులుగా జగన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అయినా ఇప్పటివరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ఎందుకు హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. తమకు కూడా అందని వైద్య పరీక్షల సమాచారం మంత్రులకు ఎవరు ఇచ్చారని వారు ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తక్షణమే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము నిత్యం వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుపుతున్నామని, అయినా మంత్రులు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు కుట్ర అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.