సింహం ముందు పందికొక్కు తొడకొట్టినట్లు: రోజా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్ నాయుడిగా మార్చుకోండి.
మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇచ్చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోంది. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేశ్ వాటా ఎంత?. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా?. తాగుబోతులంతా కూర్చోని తీసుకున్న బార్ల పాలసీ ఇది. స్కూళ్లను మూసి బార్లను తెరవడమే విజనా?. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా చేస్తున్నారు?. బార్ల పాలసీ వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదు.
జయంతి,వర్థంతికి తేడా తెలియని లోకేషా ...జగన్కు సవాల్ విసిరేది. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉంది లోకేష్ సవాల్. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్. ఇక నాపై కొంతమంది పనికిమాలిన వార్తలు రాస్తున్నారు. పనికిమాలిన టీడీపీలోకి, తలాతోకలేని జనసేనలోకి వెళ్లను. నా ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ సీపీలోనే ఉంటా’ అని రోజా స్పష్టం చేశారు.