చరిత్ర గమనానికి దిక్సూచి | Bhagat singh compass of the history | Sakshi
Sakshi News home page

చరిత్ర గమనానికి దిక్సూచి

Published Thu, Mar 23 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

చరిత్ర గమనానికి దిక్సూచి

చరిత్ర గమనానికి దిక్సూచి

తన ఆత్మ బలిదానంతో భారత స్వాతంత్య్ర చరిత్ర గమనానికి ఒక దిక్సూచిలా వెలిగిన అమరజీవి షహీద్‌ భగత్‌సింగ్‌. 1907, సెప్టెంబర్‌ 27న పంజాబ్‌లోని బాంగ్లు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుం బంలో జన్మించాడు. తల్లి విద్యావతి, తండ్రి కిసాన్‌సింగ్‌. 1919లో ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్‌ పార్క్‌లో సమావేశమైన 400 మంది పౌరులను జనరల్‌ డయ్యర్‌ 16 వందల రౌండ్లు కాల్పులు జరిపి చంపాడు. ఆనాటికి 12 ఏళ్ల వయస్సులో వున్న భగత్‌ సింగ్‌కు రక్తం ఉడికింది. 1920లో పాఠశాల చదువును పూర్తి చేసుకొని, నేషనల్‌ కాలేజీలో చేరాడు. ఈ కళాశా లలో భగవత్‌ చరణ్‌ సుఖ్‌దేవ్, యశ్‌పాల్‌లు భగత్‌ సింగ్‌కు స్నేహితులు. వారితో కలిసి దేశ చరిత్ర, విప్లవా లపై అధ్యయనం చేసేవాడు. 1924లో తన తండ్రి, నాయనమ్మ పెండ్లికి బలవంతం చేయగా.. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 1923లో ఎస్‌ఎన్‌ సన్వాల్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్థాపించిన హిందు స్థాన్‌ రిపబ్లిక్‌ ఆర్మీలో చేరాడు. త్వరలోనే ఆజాద్, భగత్‌ సింగ్‌లు సన్నిహిత మిత్రులయ్యారు.  

తరువాత తన పాత కళాశాల విద్యార్థు లను కలుపుకుని నవజవాన్‌ భారతసభను స్థాపిం చాడు. ఆపై నవజవాన్‌ భారత సభను.. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్థాపించిన హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీని కలు పుతూ హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రివల్యూషన్‌ ఆర్మీని నెలకొ ల్పారు. 1928లో భారత్‌కు వచ్చిన  సైమన్‌  కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన లాలా లజ్‌పత్‌రాయ్‌పై స్కౌట్‌ అనే బ్రిటిష్‌ పోలీస్‌ చేసిన లాఠీచార్జీతో  నవంబర్‌ 17న ఆయన చనిపోయాడు. 1928 డిసెంబర్‌ 17న భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు శాండర్స్‌ అనే బ్రిటిష్‌ పోలీస్‌ అధికారిని చంపి పోస్టర్లు వేస్తారు. రైతాంగ పోరాటాల అణచివేతకు బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్‌ సేఫ్టీ బిల్లుపై ఢిల్లీ సెంట్రల్‌ అసెంబ్లీలో చర్చకు పెట్టింది. దీనికి నిరసనగా 1929 ఏప్రిల్‌ 8న భగత్‌సింగ్, బటు కేశ్వర్‌దత్తులు ఢిల్లీ సెంట్రల్‌ అసెంబ్లీలో పొగ బాంబులు విసురుతూ కరప త్రాలు వెదజల్లారు. వీరిని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. మరోవైపున శాండర్స్‌ హత్య కేసులో భాగంగా సుఖదేవ్, రాజ్‌గురులనూ అరెస్ట్‌ చేసి రెండేళ్ల వరకు జైల్లో ఉంచింది. 1931 మార్చి 24న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయాలని ప్రకటించిన ప్రభుత్వం, దేశవ్యాప్త ఆందోళనకు భయపడి ఒక్కరోజు ముందుగానే అంటే 1931 మార్చి 23న సాయంత్రం 7 గంటలకు ఉరితీసింది.  భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌లు 23 ఏళ్ల ప్రాయంలో ఉరితాళ్ళను ముద్దాడుతూ, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ ప్రాణాలు వదిలారు. భగత్‌ సింగ్‌ భారత చరిత్ర గమనానికి ఒక దిక్సూచి
(నేడు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్థంతి సందర్భంగా)

- తోట రాజేశ్‌ బాబు
పీడీఎస్‌యూ నాయకులు
మొబైల్‌: 99493 43931

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement