Top Stories
ప్రధాన వార్తలు

‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప

కొలువుదీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే, ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ.. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమై న అంశాలు పెండింగ్లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్–1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైనా నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. తుది తీర్పు తర్వాతే ముందుకు... గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇంతలో గ్రూప్–1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించటంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపేసింది. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, గ్రూప్–1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్–2, ఆ తర్వాత గ్రూప్–3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది.ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్–1పై విచారణ ప్రక్రియ వేగం అందుకోనుంది. తుది తీర్పు వచి్చన తర్వాత ఉద్యోగాల నియామకాల్లో కదలిక వస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదని అధికారవర్గాలు అంటున్నాయి. కోర్టు కేసులతో.. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వెలువడింది. రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 563కు పెంచి టీజీపీఎస్సీ ద్వారా 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్లో ప్రిలిమినరీ పరీక్షలు, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు విడుదలతోపాటు తుది జాబితాను ప్రకటించింది.అయితే, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియలో తప్పులు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లటంతో భర్తీ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియ ఆగింది. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలా అయితేనే కిందిస్థాయి పోస్టులు ఖాళీ కాకుండా ఉంటాయని భావిస్తోంది. ⇒ గతేడాది డిసెంబర్లో గ్రూప్–4 కేటగిరీలో 8,180 ఉద్యోగాలను కమిషన్ భర్తీ చేసింది. వాళ్లంతా విధుల్లో చేరారు. ఆ సమయంలో అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువస్థాయి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ⇒ ఈ నేపథ్యంలో గ్రూప్–1 తుది జాబితాను వేగంగా విడుదల చేసినప్పటికీ నియామకాల ప్రక్రియ చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలతో నిలిచింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ⇒ గ్రూప్–1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు భర్తీ ముందుకు సాగే పరిస్థితి లేదు.

ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి రా.2.26 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.48 వరకు, తదుపరి శ్రవణం,వర్జ్యం: రా.7.49 నుండి 9.25 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: ఉ.9.11 నుండి 10.50 వరకు, తిరిగి తె.5.24 నుండి 7.02 వరకు (తెల్లవారితే సోమవారం).సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.కర్కాటకం: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కన్య: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.తుల: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.కుంభం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.మీనం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ఇది స్టేట్ ఫ్యాక్షనిజం కాదా?
ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్ సర్కార్ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్ అంశాన్ని నెగెటివ్ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్ఎఫ్ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్ సర్కార్ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్ ‘యెల్లో ట్యాక్స్’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమాచారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అను మతి పొందాయి. జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధానమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు న్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగా రని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభ పెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయ స్థానం హెచ్చరించింది. రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది. అసలు స్కామ్కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

వ్యోమయాత్రకు భారతీయుడు
పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ–11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్ఎస్కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్ఎస్ఓ’లకు ఈ మిషన్లో యురోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్ మిషన్–4 (ఏఎక్స్–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్–4 భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్ఫామ్స్ గ్రూప్ హెడ్ తుషార్ ఫడ్నిస్ తెలిపారు.ఏఎక్స్–4 మిషన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్–4 మిషన్ భారత్తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్–ఎల్ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్–4 మిషన్లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్ స్పేస్’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్ ఎక్స్’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్–4 మిషన్ చేపడుతోంది. ఈ మిషన్కు అమెరికన్ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ దీనికి కమాండర్గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు.మిషన్ స్పెషలిస్టులుగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) తరఫున పోలండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) తరఫున టైబర్ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్తో పెగ్గీ విట్సన్ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్ ఎక్స్ పాత్రఏక్సియమ్ మిషన్–4లో ఎలాన్ మస్క్ స్థాపించిన అమెరికన్ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్ ఎక్స్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్–4 మిషన్(AX-4 mission) కోసం స్పేస్ ఎక్స్ ‘ఫాల్కన్ 9 బ్లాక్ 5’ రాకెట్ను, క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఏఎక్స్–4 మిషన్ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్ 9 బ్లాక్5 రాకెట్ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్–4 మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్–4 మిషన్ ఏరి కోరి పైలట్గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్ రష్యా చేపట్టిన ‘సోయుజ్ టీ–11’ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్ టీ–11’ మిషన్కు సోవియట్ వ్యోమగామి యూరీ మాలెషెవ్ పైలట్గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో శుభాంశు శుక్లాకు పైలట్గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్ సిటీలోని యూరీ గాగరిన్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్ 17న ఐఏఎఫ్కు ఎంపికయ్యారు.ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఏఎఫ్లో అంచెలంచెలుగా, గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్ ‘గగన్యాన్’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్యాన్’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్యాన్’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్–4’ మిషన్లో పైలట్గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్యాన్ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్యాన్’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్యాన్’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు. ‘గగన్యాన్’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్యాన్’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్యాన్’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్ క్యాప్సూల్స్ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్యాన్’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్యాన్’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్ వి.నారాయణన్తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్యాన్’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్యాన్’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్యాన్’ బడ్జెట్ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్యాన్’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్యాన్’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్అమెరికన్ వ్యోమగామి. ఏక్స్–4 మిషన్కు కమాండర్. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్ఎస్కు తొలి మహిళా కమాండర్ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్’లో చేరారు. ‘ఏక్సియమ్’ చేపట్టిన ఏఎక్స్–2 మిషన్లో కమాండర్గా ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్ ఉజ్నాన్స్కీయూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో (ఈఎస్ఏ) పనిచేస్తున్న పోలిష్ ఇంజినీర్. ఏఎక్స్–4 మిషన్లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్ చేపట్టిన ‘సోయుజ్–30’ మిషన్లో పోలిష్ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్నాన్స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్ వ్యోమగామి కానున్నారు. పోలిష్ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్నాన్స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఉజ్నాన్స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్ కాపుసోవియట్ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్ వ్యోమగామి. మెకానికల్ ఇంజినీర్ అయిన టైబర్ కాపును హంగేరియన్ ప్రభుత్వం 2021లో ‘హనార్’– హంగేరియన్ టు ఆర్బిట్ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్ హయాంలో హంగేరియన్ వ్యోమగామి బెర్టాలన్ ఫర్కాస్ ‘సోయుజ్–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్ వ్యోమగామి టైబర్ కాపు కావడం విశేషం. ఏఎక్స్–4 మిషన్లో ఐఎస్ఎస్కు వెళ్లనున్న టైబర్ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు.

‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్బాష్ లీగ్లో టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్లలో 3 మ్యాచ్లే గెలిచింది. మిగిలిన మ్యాచ్లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.

బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్ఎస్ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్లో వైఎస్సార్సీపీ నిలదీసింది.

ISRO: ఆకాశంలో నిఘా నేత్రం
సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్ర దాడి, అందుకు ప్రతీకారంగా పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ ద్వారా దాన్ని కక్ష్యలోకి చేర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ప్రయోగం జరగనుంది. 17 నిమిషాలకు ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ (ఎస్ఎస్పీఓ)లో ప్రవేశపెడతారు. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుందని ఇస్రో తెలియజేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రేణిలో ఇది 63వ ప్రయోగం. కాగా ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్ను కూడా రోదసిలోకి పంపుతున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ శనివారం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయించారు. సరిహద్దులపై డేగకళ్లు మేఘాలు, దట్టమైన చీకటి కమ్ముకున్నా, తుఫాన్ల వంటివి చెలరేగినా చాలా ఉపగ్రహాలు మూగవోతాయి. కానీ ఈఓఎస్–09 అలా కాదు. అన్ని రకాల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రేయింబవళ్లూ బ్రహా్మండంగా పని చేస్తుంది. సాధారణ ఆప్టికల్ శాటిలైట్లకు అడ్డుగోడలుగా నిలిచే మేఘాలు, వర్షాలు, దుమ్మూధూళి, పొగమంచు వంటివాటి గుండా కూడా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అత్యాధునిక సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో ఒక మీటర్ పరిధిలోని వస్తువులను కూడా కచి్చతత్వంతో ఫొటోలు తీస్తుంది. → రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పూర్తి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)–1కు ఈఓఎస్–09 నిఘా ఉపగ్రహం కొనసాగింపు. → చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తీవ్రవాదుల ఉనికిని గుర్తించగలదు. వాహనాల కదలికలను కూడా అత్యంత స్పష్టంగా, కచ్చితంగా చిత్రించడం దీని ప్రత్యేకత. → ఇందుకోసం దీనికి హెచ్ఆర్ఎస్ (హై రిజల్యూషన్ స్పాట్లైట్), మీడియం రిజల్యూషన్ స్కాన్ (ఎస్ఏఆర్) వంటి అత్యాధునిక హంగులు అమర్చారు. → వ్యవసాయం, అడవుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇది కీలకమైన సేవలు అందించనుంది. → దీని డేగకళ్లు పాక్ నుంచి చైనా దాకా మన 15 వేల కి.మీ. విస్తారమైన సరిహద్దులను, 7,500 కి.మీ. పొడవైన సముద్రతీరాన్ని అణువణువూ కాపు కాస్తాయి. ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా ఇట్టే పట్టేస్తాయి. → వరదల వంటి ప్రాకృతిక విపత్తుల వేళ మేఘాలను చీల్చుకుంటూ ఈఓఎస్–09 అందించే రియల్ టైం చిత్రాలు, డేటా నష్ట తీవ్రతను తక్షణం అంచనా వేయడంలో దోహదపడతాయి.

రాజకీయ ప్రేరేపిత కేసే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా? సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి... చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది 2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది. సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తించింది. కానీ, సిట్లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది. సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు. ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది. హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు. కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక రెడ్బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్రెడ్డికి ముగిసిన కస్టడీ విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.

ట్రంప్ ‘బిగ్బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్ను బిగించడం, కన్సాస్లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
పాక్పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
కాంగ్రెస్కు బిగ్ షాక్
నీట్–యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే
శ్రీశైలం డ్యామ్ విపత్తుతో అమరావతికీ ముప్పు.!
ట్రంప్ ‘బిగ్బాస్’ షో!
జనరేషన్ కష్టాలు
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
పాక్పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
కాంగ్రెస్కు బిగ్ షాక్
నీట్–యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే
శ్రీశైలం డ్యామ్ విపత్తుతో అమరావతికీ ముప్పు.!
ట్రంప్ ‘బిగ్బాస్’ షో!
జనరేషన్ కష్టాలు
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంక భారీ విరాళం..
సినిమా

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ)

'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్)

'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)

సినిమాలు, రేసింగ్.. హీరో అజిత్ కీలక నిర్ణయం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith)కి రేసింగ్ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్ హీరో అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్పై ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్ ఇస్తానని చెప్పుకొచ్చాడు.‘రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్లో పాల్గొనడం చాలా కష్టమైన పని. కార్ల రేస్పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు డైట్ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్బాష్ లీగ్లో టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్లలో 3 మ్యాచ్లే గెలిచింది. మిగిలిన మ్యాచ్లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.

ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆర్సీబీ ఫైనల్కు వెళ్తే భారత్కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్కు చేరుకుంటే తను ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్

టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్మన్ గిల్కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?
బిజినెస్

జియో యూజర్లకు శుభవార్త: రూ.100 రీఛార్జ్తో ఎన్నో బెనిఫిట్స్!
భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులతో అగ్రగామిగా ఉన్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ 'జియో'.. రూ.100 ప్లాన్లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.100 ప్లాన్జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్.. సాధారణంగా రూ.299 ప్లాన్లో కనిపించే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.బేస్ ప్లాన్ రీఛార్జ్ తప్పనిసరిజియో వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే.. జియో నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాల్సిందే. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా.. రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు.

గృహ కొనుగోళ్లలో మారుతున్న ఆలోచనలు.. ఇవన్నీ ఉండాల్సిందే!
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆరోగ్యానికి ప్రాధాన్యం: ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను గమనిస్తున్నారు. అత్యవసర సమయంలో ఎంతసేపట్లో ఆసుపత్రికి చేరుకోవచ్చు, ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనే విషయాలను పరిశీలిస్తున్నారు. పెద్దల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఈ విధంగా ఆలోచిస్తున్నారు.ఆట స్థలాలు: ఇల్లు విశాలంగా ఉండటమే కాదు పిల్లలు ఆదుకోవడానికి కావలసిన ఆట స్థలాలు కూడా ఉన్నాయా? లేదా అనే విషయాలను చూస్తారు. పిల్లల కోసం ఆట స్థలాలు, పెద్దల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్ మొదలైవి ఉండేలా చూసుకుంటారు. ఎక్కువ ఖాళీ స్థలం కంటే.. ఎక్కువ పచ్చదనాన్ని కోరుకుంటున్నారు.డే కేర్ సెంటర్: చిన్న కుటుంబాల కారణంగా.. చిన్న పిల్లల ఆలనా పాలన కోసం డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.భార్య భర్తలు ఇద్దరూ ఆఫీసుకు వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా చూసుకుంటారు.ఆఫీసుకు దగ్గర్లో: ఇల్లు కొనేటప్పుడు.. ఆ ఇల్లు ఆఫీసుకు ఎంత దూరంలో ఉండనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఇల్లు దూరమయితే.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. దీని నుంచి తప్పించుకోవడానే.. ఇల్లు ఆఫీసులకు దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.వీకెండ్ ఎంజాయ్..వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.

కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.రాబోయే రూ .20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి."రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ .20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

అమెరికాకు షాక్.. రేటింగ్కు కోత పెట్టిన మూడీస్
అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్కు కోత పెట్టింది.పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్ క్రెడిట్ రేటింగ్ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది. అగ్రరాజ్యం తన టాప్ ర్యాంకింగ్ను కోల్పోవడం చరిత్రలో ఇదే తొలిసారి.అమెరికా ఆర్థిక పథంపై పెరుగుతున్న భయాందోళనలకు ఇది సంకేతంగా నిలుస్తోంది. గతంలో 2023లో ఫిచ్ రేటింగ్స్, 2011లో స్టాండర్డ్ అండ్ పూర్స్ ఏజెన్సీలు ఇలాగే అమెరికా రేటింగ్కు కోతలు పెట్టాయి. తాజాగా మూడీస్ తొలిసారిగా అగ్రరాజ్యం ర్యాంక్ను తగ్గించింది. ఫెడరల్ లోటు 2024లో జీడీపీలో 6.4 శాతం నుంచి 2035 నాటికి దాదాపు 9 శాతానికి పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది.క్రెడిట్ రేటింగ్ తగ్గడం వల్ల వ్యాపార సంస్థలు, వినియోగదారులకు రుణ వ్యయాలు పెరుగుతాయని, తనఖా రేట్లు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు వడ్డీపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడీస్ స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించినప్పటికీ ఆ దేశ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో రాజకీయ గందరగోళం ప్రధాన అవరోధంగా పేర్కొంది.ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను కోతలు, వ్యయ తగ్గింపులను అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో మూడీస్ నుంచి ఈ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. రేటింగ్ను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ కొనసాగుతున్న రికవరీ ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని వాదించింది. అయితే రేటింగ్ కోత ప్రస్తుత పాలనలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితికి ప్రతిబింబంగా విమర్శకులు భావిస్తున్నారు.ఈ వార్తలపై ప్రపంచ మార్కెట్లు స్పందిస్తుండగా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, విధాన నిర్ణేతలు ఎలా స్పందిస్తారో ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ డౌన్ గ్రేడ్ అమెరికాలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం గురించి కొత్త ఆందోళనలను రేకెత్తిస్తుంది. పెరుగుతున్న రుణ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనాలని పాలకులపై ఒత్తిడిని పెంచుతుంది.
ఫ్యామిలీ

వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్సైజ్లతో మొదలుపెట్టి వర్కవుట్స్ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు. 在 Instagram 查看这篇帖子 Choudhary Ajay Sangwan (@weightliftermummy) 分享的 జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్బార్ డెడ్లిఫ్ట్లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది. ‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!డైట్ విషయానికి వస్తే...‘ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్

అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్లకు కోచ్గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

చెమట కంపు... వదిలించుకోండిలా...!
వేసవిలో చెమట వాసన అత్యంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ కాలేజీ అయినా, ఆఫీసు అయినా, పార్టీ అయినా, ఫంక్షన్ హౌస్ అయినా చెమట దుర్వాసన వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు అందరూ చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు వంటి వివిధ రకాల సువాసనలను ఉపయోగిస్తారు. కానీ కొంత మంది పెర్ఫ్యూమ్, డియోల నుంచి వచ్చే ఘాటైన వాసనను తట్టుకోలేరు. అలెర్జీ కూడా కలిగిస్తుంది.బ్రిటన్లోని యూనివర్శిటీ ఆఫ్ యార్క్ పరిశోధన ప్రకారం.. చెమట వాసనకు గల కారణాలలో ముఖ్యమైనది ఎంజైమ్. ఇది ప్రధానంగా చంకలలో కనిపించే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. వీటి మూలాన్ని తొలగించడం వల్ల చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు.చెమట వాసన ఎంజైమ్లను తొలగించడానికి ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మ, టమోటా, కొబ్బరి నూనె వంటి కొన్ని గృహోపకరణాల ద్వారా చెమట దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు. రెండు నిమ్మకాయలను కట్ చేసి చెమట పట్టిన ప్రదేశంలో రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసం ఆరి΄ోయినట్లు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చెమట దుర్వాసన ఇట్టే పోతుంది.ప్రతిరోజూ స్నానానికి ముందు టొమాటోను కట్ చేసి.. దీని రసాన్ని శరీరంలోని చెమట ఉన్న భాగాలపై రాసుకోవాలి. కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే చెమట వాసన దూరం అవుతుంది.చెమట దుర్వాసనను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని లారిక్ యాసిడ్ చెమటలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని, ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన రానేరాదు.

బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!
ఫొటోలు
అంతర్జాతీయం

పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్ఫోర్స్ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్లైన్ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్లైన్ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్లైన్కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025

ఆపరేషన్ సిందూర్కి ముందు ట్రంప్,పాక్ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes
జాతీయం

భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం.

హరే కృష్ణ మందిరం ఇస్కాన్–బెంగళూరుదే
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సేల్ డీడ్ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు.

భారత్, అఫ్గాన్ స్నేహ గీతం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజాగా అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్లోని తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ సిద్ధపడగా, అప్పటి తాలిబన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు శతాబ్దాల పాటు అఖండ భారత్లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. అఫ్గాన్ను భారత్ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది. పాకిస్తాన్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్లో తాలిబన్ సర్కార్ను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్–అఫ్గాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు. ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు! మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్–అఫ్గాన్ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం అఫ్గాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్కు ఇక ముసళ్ల పండుగే జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగినట్లు భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్ను ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. పాక్–అఫ్గాన్ మధ్య రగులుతున్న విభేదాలు తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్లో పాక్ సైన్యం అఫ్గాన్లోని పాక్తీకా ప్రావిన్స్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్ధారించిన డురాండ్ లైన్ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్ గుర్తిస్తుండగా, అఫ్గాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్ శరణార్థులను పాక్ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సాక్షి, నేషనల్ డెస్క్

బార్ తీరుపై సీజేఐ ఆక్షేపణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడ్కోలు పలకరాదన్న ఎస్సీబీఏ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జస్టిస్ త్రివేదికి వీడ్కోలు పలికేందుకు తన సారథ్యంలో కొలువుదీరిన లాంఛన ధర్మాసనం నుంచే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తి రిటైరవుతున్న సందర్భంలో బార్ అలాంటి వైఖరి తీసుకోకుండా ఉండాల్సింది. దాని తీరుతో బాహాటంగా విభేదిస్తున్నా. నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడే వ్యక్తిని. కనుక ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేయడం చాలా అవసరమని కూడా భావిస్తున్నా’’ అని ఎస్సీబీఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కపిల్ సిబర్, రచనా శ్రీవాత్సవ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. అయితే లాంఛన ధర్మాసన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ‘‘బెంచ్ మరోలా తీర్మానించినా వచ్చి పాల్గొన్నందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ త్రివేది ఎంత సమర్థురాలో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. న్యాయమూర్తుల్లో కొందరి నుంచి ఆశించిన తీర్పులు రావు. వారికి దక్కాల్సిన వాటిని నిరాకరించేందుకు అది కారణం కారాదు’’ అన్నారు.జస్టిస్ త్రివేది న్యాయవ్యవస్థకే ఆభరణంజస్టిస్ త్రివేదీ న్యాయవ్యవస్థకే ఆభరణమంటూ సీజేఐ జస్టిస్ గవాయ్ కొనియాడారు. ట్రయల్ కోర్టు జడ్జిగా ప్రస్థానం ప్రారంభించి సుప్రీంకోర్టు దాకా ఎదిగిన తొలి న్యాయమూర్తి ఆమేనని గుర్తు చేశారు. గుజరాత్ నేషనల్ లా వర్సిటీ ఏర్పాటు వంటివాటిలోనూ ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సభ్యురాలిగా మెజారిటీ తీర్పుతో జస్టిస్ త్రివేది విభేదించారు. తద్వారా స్వతంత్ర ఆలోచనకు, స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు. వ్యక్తిగత జీవిత సవాళ్లు తన ఉద్యోగ ధర్మాన్ని ఏనాడూ ప్రభావితం చేయనివ్వలేదు. ఆరోగ్యం బాగాలేని తండ్రిని చూసుకునేందుకు వారాంతాల్లో అహ్మదాబాద్ వెళ్లి, ఎంత కష్టమైనా సోమవారాకల్లా కోర్టుకు హాజరయ్యేవారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘జస్టిస్ త్రివేదీ! నిజాయతీకి, నిష్పాక్షికతకు, శ్రమించే తత్వానికి మీరు మారుపేరు. జీవిత ప్రయాణంలో నూతన అధ్యాయానికి తెర తీస్తున్న సందర్భంగా అభినందనలు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు బార్ సభ్యులు తదితరులు జస్టిస్ త్రివేది సేవలను కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైరైనప్పుడు ఎన్సీబీఏ వీడ్కోలు సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.నా తీర్పులే మాట్లాడాయి: జస్టిస్ త్రివేదితానేమిటో చెప్పేందుకు 30 ఏళ్లుగా తానిచ్చిన తీర్పులే నిదర్శనమని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి తీర్పులోనూ ఆత్మ ప్రబోధానుసారమే నడుచుకున్నా. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా విధ్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో, నిజాయతీతో నెరవేర్చిన తృప్తితోనే సెలవు తీసుకుంటున్నా’’ అని చెప్పారు.11వ మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన 11వ మహిళగా జస్టిస్ త్రివేది నిలిచారు. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. ఆమె జూన్ 9న రిటైరవాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో శుక్రవారమే పదవీ విరమణ చేశారు. ఆమె 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అదే రోజు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు సహా రికార్డు స్థాయిలో మొత్తం 9 మంది బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ త్రివేది సిటీ సివిల్ కోర్టు జడ్జిగా నియుక్తురాలైన సమయంలో ఆమె తండ్రి కూడా అదే హోదాలో ఉండటం విశేషం!
ఎన్ఆర్ఐ

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్లర్ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.
క్రైమ్

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్కుమార్రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్కేస్లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.