మరిన్ని ఆధారాలు లభ్యం!
- ఓటుకు నోటు కేసులో ఏసీబీకి కీలక సమాచారం
- 'బాస్’, మరో 15 మందిని నిందితులుగా చేర్చే అవకాశం
- ఏపీకి చెందిన ఓ కార్పొరేట్ సంస్థ ద్వారానే రూ. 50 లక్షలు
- ఇద్దరు రాజ్యసభ సభ్యుల నేతృత్వంలో రేవంత్ డీల్
- నిందితులకు ముగిసిన ఏసీబీ కస్టడీ
- చివరిరోజు అనూహ్యంగా రేవంత్, మిగతా ఇద్దరి ఇళ్లలో సోదాలు
- పలు పత్రాలు, ఖాతాలు, లాకర్ల వివరాలు, సీసీ ఫుటేజీలు స్వాధీనం
- నిందితులకు 15 వరకు రిమాండ్ పొడిగింపు, చర్లపల్లి జైలుకు తరలింపు
- నేడు విచారణకు రేవంత్ బెయిల్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల కేసులో ఏసీబీ కీలక ఆధారాలు రాబట్టింది. ఈ కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహలను నాలుగు రోజులు విచారించిన దర్యాప్తు అధికారులు సంతృప్తికరమైన ఆధారాలను సమకూర్చుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కొనుగోలుకు తెరవెనక నుంచి వ్యవహారం నడిపించిన ‘బాస్’ బృందం వివరాలు, పెద్దమొత్తంలో నగదు సమకూర్చిన టీడీపీ అనుబంధ కార్పొరేట్ సంస్థ వివరాలను సేకరించారు.
స్టీఫెన్సన్తో ‘బాస్’ మాట్లాడడానికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు, తమ దగ్గరున్న ఆధారాలతో నిందితులిచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకోగలిగారు. ఈ కేసులో ‘బాస్’తోపాటు మరో 15 మందిని నిందితులుగా చేర్చేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ఏసీబీ అధికారులు సంపాదించారు. నిందితుల పూర్వాపరాలతో పాటు కొంతకాలంగా వారు వినియోగించిన ఫోన్లలోని కాల్లిస్టులు, వారి ఇళ్ల వద్దకు వచ్చిన వ్యక్తులు, బ్యాంకుల ద్వారా సాగిన లావాదేవీల వివరాలను సేకరించారు.
స్టీఫెన్కు రేవంత్ అడ్వాన్స్గా ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపైనే విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు బయటకు చెబుతున్నప్పటికీ పలు బృందాలుగా ఏర్పాటై ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ మొత్తాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు కాల్ రికార్డులు బయటకొచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.
కాగా, రేవంత్, ఇతర నిందితుల కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులు వారిని ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు జరిపించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 15వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇళ్లలో సోదాలు..
కస్టడీలో నాలుగోరోజైన మంగళవారం అనూహ్యంగా ముగ్గురు నిందితుల ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఉదయం 4.30 గంటల నుంచే చేపట్టిన ఈ తనిఖీల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని రేవంత్ కొత్త, పాత ఇళ్లు రెండింటిలోనూ ఏసీబీ బృందం రెండు విడతలుగా సోదాలు నిర్వహించింది. అక్కడి కంప్యూటర్లలోని సమాచారం, హార్డ్ డిస్క్లు, సీసీ పుటేజీల రికార్డులను, సర్వర్లను స్వాధీనం చేసుకుంది. అలాగే ఎర్రగడ్డలోని సెబాస్టియిన్ ఇల్లు, నాగోల్లోని ఉదయ్ సింహ ఇంట్లో కూడా ఒకేసారి సోదాలు నిర్వహించిన అధికారులు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలు, భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల సమాచారాన్ని నమోదు చేసుకున్నారు.
బ్యాంకు లాకర్లలో పెద్దఎత్తున ఆస్తులున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితుల కుటుంబసభ్యులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టారు. ఏసీబీ వద్ద ఉన్న ఆడియో, వీడియో రికార్డుల సంభాషణలకు బలం చేకూర్చే ఆధారాలను ఏసీబీ సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఉదయ్సింహ ఇంట్లో 8 విదేశీ మద్యం సీసాలు లభించడంతో వాటిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తేవడంతో ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం, ఇళ్లల్లో సోదాలు, ఫోన్ కాల్లిస్టులు, బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు తమ విచారణలో తేలిన అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం.
బాస్ ఆశీస్సులతో.. ఎంపీల నేతృత్వంలో..
తెలంగాణలో ఎమ్మెల్సీని గెలవడం ద్వారా టీడీపీని బలమైన శక్తిగా చాటడంతోపాటు అధికార టీఆర్ఎస్ను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం నేతలు వ్యూహం రచించినట్లు నిందితుల విచారణలో స్పష్టమైంది. ‘బాస్’ కోసమే రేవంత్, పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పారిశ్రామికవేత్తలు... ఏపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ మంత్రి, తెలంగాణకు చెందిన ఓ ఎంపీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డీల్ నడిపించినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది.
‘బాస్’ ఎవరనే విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించేలా ఓ టీటీడీపీ నేత పేరును రేవంత్ చెప్పినప్పటికీ.. మిగతా ఇద్దరు నిందితులు మాత్రం అసలు బాస్ ఎవరో తేల్చినట్లు సమాచారం. చంద్రబాబు వద్దకు డీల్ అంశాన్ని తీసుకెళ్లిన సెబాస్టియిన్ విచారణలో తనకు తెలిసిన విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించారని తెలిసింది.