bhagavadgita
-
జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్ సోమలాల
రామంతాపూర్: పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. దీన్ని భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి ఎలా మసులు కోవాలి.. కష్టసుఖాల్లో ఎలా వ్యవహరించాలి తదితర విషయాలపై మానవాళిని సన్మార్గంలో నడిపే పవిత్ర గ్రంథం భగవద్గీత. భారతీయ సంస్కృతికి గోపురం వంటి గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించారు. దాదాపు ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువదించబడినా బంజారాలకు మాత్రం చేరలేదు. దాంతో వారికి భగవద్గీత సారాన్ని అందించాలని అనుకున్నారు హబ్సిగూడవాసి కేతావత్ సోమ్లాల. తన జాతి జాగృతం కోసం మొక్కవోని సంకల్పంతో 16 నెలలు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారాభాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి అందజేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వర్తించి వీఆర్ఎస్ తీసుకున్నారు. విద్యార్థి దశలోనే బంజారాలను చైతన్యపరుస్తూ 200లకుపైగా పాటలు రాశారు. తండాలు తిరుగుతూ ఈ పాటలు పాడి బంజారాలను ఉత్తేజపరిచారు. విద్యార్థి దశలోనే బంజారా భాషలోకి అనువాదం చేసేందుకు ఎంతో శ్రమించారు. బంజారా భాషలో మల్లె మొగ్గ అనే పదాన్ని ఏమాంటారో తెలుసుకోవడం కోసం తిరగని తండా లేదు. పువ్వుడా అంటారని తెలుసుకొని ఆ పదాన్ని గీతలోకి చేర్చారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి 1988 ఆగస్టు నెలలో అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలలు కృషి చేస్తే పూర్తయింది. కానీ ముద్రణకు మాత్రం 25 ఏళ్లు నిరీక్షించాల్సి వచి్చంది. బంజారా భగవద్గీతను అప్పటి టీటీడీ ప్రెస్ అధికారి రవ్వ శ్రీహరి సహకారంతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జడ్జి రమణ ఆవిష్కరించారు. బంజారాల కోసం అనువదించిన భగవద్గీతతో పాటు ది హిస్టరీ ఆఫ్ బంజారా, బంజారా గీతమాల వంటి రచనలు చేసిన సోమ్లాల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2001లో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ముంబై వారు సోమ్లాల్కు బంజారా జానపద బ్రహ్మ అనే అవార్డు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ బంజారా సాహిత్యానికి సోమలాల్ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు కంకణం తొడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన జనగామలోని ప్రభుత్వ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సమయంలో ఈ హాస్టల్ పక్కనే ఉన్న గీత మందిరం నుంచి ప్రతిరోజూ ఉదయం లౌడ్ స్పీకర్లో వినిపించే గీతా శ్లోకాలను వింటూ స్ఫూర్తి పొందారు. వెనుకబడిన తన బంజారా సమాజానికి గీతా సారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. -
‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్
మనం దెయ్యాలు గురించి ఎవరైనా చెబుతుంటే వారు చదువుకోలేదేమో! లేక వాళ్లు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కొట్టిపారేస్తాం. పైగా మూర్ఖులుగా భావించి కాస్త చిన్నచూపు చూస్తాం. కానీ మంచి ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తి దెయ్యాల గురించి చెబితే ఒకింత ఆశ్యర్యపోతూ వింటాం. పైగా ఎవరతను అని కచ్చితంగా కుతుహలంగా ఉంటుంది. అచ్చం అలానే ఒక ఐఐటీ ప్రొఫెసర్ దెయ్యాల గురించి కొన్ని ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకెళ్తే... ఐఐటి మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా దెయ్యాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. పైగా వాటిని తాను మంత్రాలు, శ్లోకాలు పఠించి దెయ్యాల్ని తరిమికొట్టానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు దెయ్యాలు గురించి చెబుతూ..1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు. పైగా తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేహితుడి భార్యని, అతని తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ఇలా ఒక ఐఐటీ ప్రోఫెసర్ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్లో "లెర్న్ గీత లైవ్ గీత" పేరుతో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్ అవుతోంది. అయితే బెహరా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్డీ కూడా చేయడమే కాక రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రోఫెసర్ కావడం విశేషం. (చదవండి: కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!) (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
బుల్లి భగవద్గీత.. చదరపు సెంటీమీటరు పుస్తకంలో..!
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు. -
హరియాణాలో ‘గీత’ కుంభకోణం!
చండీగఢ్: గత ఏడాది హరియాణాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అట్టహాసంగా ‘అంతర్జాతీయ గీత మహోత్సవా’న్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ఖట్టర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని అతిగా దుబారా చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పది ‘భగవద్గీత’ గ్రంథాలను కొనుగోలు చేసేందుకు రూ. 3.8 లక్షలు ఖర్చుచేసినట్టు తాజాగా ఓ ఆర్టీఐ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా తెలిపింది. గీత మహోత్సవంలో పాల్గొన్న వీవీఐపీలకు కానుకగా అందజేసేందుకు ఈ పది భగవద్గీతలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. బయట మార్కెట్లో సాధారణంగా రూ. 150-200లకు ’భగవద్గీత’ గ్రంథాలు లభిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం భారీగా ఖర్చుచేసి వీటిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. వీఐపీలకు అందజేసేందుకు ఖరీదైన కాగితంతో తాళపత్ర గ్రంథాల తరహాలో ఉండేలా వీటిని రూపొందించామని, అందుకే ఇంత ఖర్చు అయిందని ఖట్టర్ సర్కారు చెప్తోంది. అంతర్జాతీయ గీత మహోత్సవానికి రూ. 4.32 కోట్లు ఖర్చు చేశామని ఖట్టర్ సర్కారు ఓ ఆర్టీఐ ప్రశ్నకు వెల్లడించగా.. అనధికారికంగా ఈ ఉత్సవానికి రూ. 15 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ప్రజాధనం ఖర్చు చేసే విషయంలో పారదర్శత ఏమాత్రం పాటించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
'భగవద్గీత మత గ్రంథ కాదు'
గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా): భగవద్గీత మత గ్రంధం కాదని అదొక అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అని గీతలోని కొన్ని శ్లోకాల్ని వినిపించారు భారత దేశపు మెట్రోమెన్గా పిలువబడుతున్న రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఇ.శ్రీధరన్. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థాపకుడు స్వర్గీయ వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు సంస్మరణగా ఏటా నిర్వహించే స్మారకోపన్యాసాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రసంగించారు. విద్యార్ధినీ విద్యార్ధులందరూ భగవద్గీతను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటే తొందరగా నిద్ర పట్టడంతో పాటు వేకువజామునే నిద్ర లేచి, సమయానిన సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు ఆరోగ్యం సహకరిస్తోందని చెప్పారు. విద్యార్ధులు సమయపాలనతో పాటు సమగ్ర సాంకేతిక సామర్ధ్యం కలిగి ఉండాలని తెలిపారు. మానవతా విలువలతో కూడిన పని విధానమే ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలతో సాగే పని సంస్కృతి ప్రామాణికమైన అత్యంత ఆవశ్యకమని తెలిపారు. కాలేజీ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణరావు, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ చేతుల మీదుగా స్ఫూర్తిదాయక ప్రసంగం అందించిన డాక్టర్ శ్రీధరన్కు దుశ్శాలువాతో సన్మానించి, సన్మాన పత్రాన్ని అందజేశారు. యాజమాన్యం చేతుల మీదుగా స్మారకోపన్యాస పురస్కారంగా అందుకున్న రూ.లక్ష నగదును తన తల్లి పేరిట స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్కు అందిస్తానని శ్రీధరన్ తెలియటం ఆయన సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమంలో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ డెఫ్యూటీ డెరైక్టర్ జి.పి.రంగారావు, ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ డెఫ్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజశేఖర్, విద్యాసంస్థ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కేవీ కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరెడ్డి, డెరైక్టర్ డాక్టర్ ఎస్ఆర్కే రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు, కార్యక్రమ కో-ఆర్డినేటర్లు బి.కరుణకుమార్, డాక్టర్ ఎం.కామరాజు తదితరులు పాల్గొన్నారు.