
బాలశివతేజ ,చదరపు సెం.మీ. పరిమాణంలో ఉన్న భగవద్గీత పుస్తకం
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది.
దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు.