breaking news
boddemma
-
వంద పూలై విరిసే జ్ఞాపకాలు!
జ్ఞాపకాలు గతం ఇనప్పెట్టెలో భద్రంగా ఉంటాయి. దాని మూత తీయాలని అనుకున్నప్పటి నుండి మానసిక వైబ్రేషన్కు గురవుతాం. చిన్ననాటి స్మృతులు ముసురుకుంటాయి. సాధారణంగా పదేళ్ళ వరకు బాల్యదశ ఉంటుంది. ఈ స్లాట్ మనిషికి స్వర్ణయుగం. ప్రతిక్షణం కుటుంబంలో, సమాజంలో, వీధిలో, ఊరిలో, బడిలో, పక్కింట్లో ప్రతిచోట ప్రతి అనుభవం గుండె గోడలమీద బొమ్మ కడుతుంది. నలుపు తెలుపు రంగుల్లో సినిమా రీల్లాగా గర్గర్ మని ఒక్కో సంఘటన మనసు తెర మీద కదలాడుతుంది.ఒక పండగని జ్ఞాపకం అయితే మరింత సంబరం. పూలదొంతర అల్లాలంటే ఒళ్ళంతా పులకరింతే. గత పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దవడమే. బతుకమ్మ పండుగ రంగుల హరివిల్లుల్ని తెంపి వెన్నెల్లో ఆరేసి, వర్షంలో తడిసిన మట్టి సుగంధాలలో నానబెట్టి, కొత్త రంగురంగుల కాంతి తరంగాలని వాటికి పట్టించి నూటొక్క మొగ్గల్ని, పూలని, ఆకుల్ని తొడిగిన పూగుత్తుల్ని పేర్చాలంటే అంత సులభం కాదు. ఇలాంటప్పుడే గత అవిస్మృత ఖజానా విలువ తెలుస్తుంది. పూలను పరిరక్షించే ఇనప్పెట్టె తయారు కానందుకు బాధ. పుప్పొడిలా రాలిన కనబడని కన్నీటి తుంపరల్ని ఎలా, ఎక్కడని దాచగలం.మాది ఊరు కాని ఊరు. పట్టణంలో ఒదిగి ఉన్న ఊరు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ. మా ఇంటి చుట్టూరా అనేకానేక చిన్నా పెద్దా ప్రాచీన గుళ్ళు, చారిత్రక ప్రదేశాలు. ఇంటికి కాస్త దూరంలో మూడు పెద్ద గుట్టల మధ్య పద్మాక్షి గుడి. గుడి కింద నీటి గుండం. అందులో బంగారు జింక ఆకర్షణలా తామరాకులు, పూలు! గుట్టల మీద సీతా ఫలాలే కాదు, ఎన్నో రకాల పూలు, గునుగు పూలు, తంగేడు, గన్నేరు పూలు... ఎన్నెన్నో.మా ఇంట్లో నాకన్నా చిన్నది చెల్లెలు. ఇంటిపక్కన పాటకుల ఇంట్లో ఓ చిట్టెమ్మ. ఇంటి పక్కల చుట్టాలు, పరిచయస్తుల ఇళ్ళల్లో ఆడపిల్లలు. వీళ్లు బొడ్డెమ్మ ఆడేవాళ్లు.భాద్రపదం ప్రకృతి పచ్చదనానికి గర్భ శిశువు. ఈ మాసం ప్రకృతి పరవశించే నిండు చూలాలు. బొడ్డెమ్మ వస్తుందంటేనే పూలవేట షురువయ్యేది. ఆడపిల్లల్ని బొడ్డి అంటారు. బొడ్డి అంటే చిన్నది అని అర్థం. ఈ ఆడపిల్లలు ఆడే బొడ్డెమ్మ ఒక ప్రత్యేక పండగ. ఎవరి ఇంట్లోనూ పదిమంది ఆడే ఆట స్థలం ఉండేది కాదు. గుడిలోనో, ఏదో ఓక బహిరంగ ప్రదేశంలోనో వాళ్ళు వెదురుతో చేసిన చిన్న చిన్న సిబ్బుల్లో పూలు పట్టుకుని అక్కడికి చేరేవారు. అక్కడ కుమ్మరాయన మట్టితో బొడ్డెమ్మ గద్దె తయారు చేసేవాడు. కిందివైపు పెద్దగా పైవైపు చిన్న ఆకారంతో మట్టితో చతురస్రాకారంతో గద్దె కట్టేవాడు. దానికి నాలుగు దిక్కులా ప్రమిదలు పెట్టేవాడు. దానిలో రోజుకొక్కరు 9 రోజులు 9 ఇళ్ళలోంచి నూనె తెచ్చేవారు. దాని చుట్టూ రోజూ కొత్తగా ముగ్గులు వేసేవారు.ఈ పనంతా బాలికలే చేసేవారు. ఊరి వడ్రంగి కర్రతో బొడ్డెమ్మ గద్దె చేసి ఇచ్చేవాడు. దానికి పసుపు, తెలుపు రంగులు వేసేవారు. దానిమీద కూడా ప్రమిదలు ఉండేవి. మధ్యలో పిల్ల బతుకమ్మని చెక్కేవాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని డెబ్బై ఐదేళ్ల తర్వాత అలాంటి కర్ర బొడ్డెమ్మ వస్తువుని ఆద్యకళ మ్యూజియం కోసం సేకరించాను. మగపిల్లల టీం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ కోసం సంచులు పట్టుకుని పూలవేటకు వెళ్ళేవారం. గునుగు పూలు తెచ్చి రకరకాల రంగులద్దేవాళ్ళం. తంగేడు పూలు, ఆకులు, కొమ్మలతో తెంపేవాళ్ళం. ఇంటికి వచ్చి పూలను వేరు చేసేవాళ్ళం. జలాశయాల్లోంచి తెచ్చిన తామర ఆకుల్ని సిబ్బుల కింద ఉంచేవాళ్ళు. కొంతమంది ఎర్రని తామరపూవుని పైన అలంకరించేవాళ్ళు. పై భాగాన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ తల్లిగా సంభావించేవారు. మరికొందరు గుమ్మడి ఆకుల్ని సిబ్బులో పరిచి బతుకమ్మ పైన గుమ్మడిపూవుని ఉంచేవారు. పూవు మధ్య భాగం కేసరాలు ఉండేచోట పసుపు రంగు ఉండేది. దాన్నే గౌరమ్మగా భావించేవారు. మేం ఇంత కష్టపడితే మాకు దక్కేది ఆట పాటల తర్వాత అక్కలు, అమ్మలు పెట్టే ప్రసాదం. రోజుకో తీరొక్క ప్రసాదం. ఇంటికోరకం ప్రసాదం తెచ్చి అన్నీ ఒక్కో గంపలో వేసి వాళ్లు తిని మాకు పెట్టేవారు. ఆ రుచే వేరు. తలుచుకుంటేనే నోరూరుతుంది. బొడ్డెమ్మ, బతుకమ్మలను తలకెక్కించుకునే సందర్భంలో ఆకులతో చేసిన పీకలు ఊదేవాళ్ళం. మరికొందరి దగ్గర కర్రతో చేసిన గొట్టం ఉండేది. ఎండిన గింజల్నో, కాగితం తుంచి దాన్ని నమిలి చేసిన ముద్దనో కర్ర బర్మారులో పెట్టి బాగా ఊదేవాళ్లం. అది పిస్తోలు పేల్చినట్లు శబ్దం అయ్యేది. ఎవరి శబ్దం పెద్దగా ఉంటే వారిపై ప్రశంసల పూల జల్లు పడేది. అలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆరో రోజు అరెం. అంటే ఆరోజు బతుకమ్మ పేర్చరు. సెలవుదినం. ఆట ఉండదు. మాకు కూడా కాస్త తీరిక దొరికేది. కాకపోతే బతుకమ్మ ప్రసాదం దొరికేది కాదు. పండుగ తొమ్మిది రోజులు చాలా ఇండ్లల్లో శాకాహారమే ఉండేది. కొత్త ధాన్యంతో, పప్పులతో తయారు చేసిన రుచి ఈనాటికీ గుర్తు చేసుకుంటే నోరూరుతుంది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆట పాటలతో గడిచేది. అక్కలు, చెల్లెల్లు, కోడళ్ళు, మరదళ్లతో సందడిగా గడిపిన క్షణాలు ఈ తరాలకు దక్కని మహోత్కృష్ట గడియలు.బతుకమ్మలనే కాదు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రపరిచి అలంకరించేవారు. ఇళ్ళు ముందు భాగం ముగ్గులు రంగులతో మెరిసిపోయేవి. వివిధ రకాల పూలు ఒక్కచోట ఉంచడం వల్ల చక్కని సువాసనలతో ఆ ప్రదేశం ఎంతో బాగుండేది. బతుకమ్మలపై కొందరు అగరుబత్తీలు పెట్టేవారు. చాలా కాలం దాచిపెట్టి పండుగ రోజున కట్టుకునే పీతాంబరం, పాత చీరల ప్రత్యేక వాసన ఇంకా పీల్చుతున్నట్లే ఉంటుంది. రోజూ అలికిన తాజా వాసన సైతం పండగ ప్రత్యేకతని చెప్పకనే చెప్పేది.బాలికల గుంపు చిన్న మగపిల్లగాళ్ల గుంపు, యువతుల గుంపు, తల్లుల గుంపు, అమ్మమ్మ నానమ్మల గుంపు ఇలా ఎవరి గుంపు వారిదే. ఎవరి స్నేహితులతో వారు కలిసిమెలసి ఉండేవారు. హాస్యం వందపూలై పూసేది. సామెతలతో సంభాషణ నవరసాలతో ఆకట్టుకునేది. వరసలను బట్టి హాస్యం, చతురోక్తులు ఉండేవి. ఇది పండుగ సంబరాన్ని మరింత పెంచేది. ఊరు ఊరంతా గాన ప్రవాహంలో ఈదేది. చెరువు గట్టో, నీటి గుండాల పక్కనో వాళ్ల నృత్యంతో భూమి పులకరించేది. సంధ్యాసమయంలో ప్రకృతిని చూసి మా ఒడలు పులకరించేది. నాడు బతుకమ్మ ప్రకృతి పండుగ. నా జ్ఞాపకాలలో ఆనాటి ప్రాకృతిక సౌందర్యం చూడడం కోసం ఊరూ, వాడా, అడవీ, పల్లె తిరుగుతూనే ఉన్నాను. ఏదో తెలియని శూన్యం. నా జీవితకాలం అంతా పద్మాక్షి గుట్ట కింద నీటి గుండంలోని తామర పూవుల సువాసన ఇంకా వెన్నాడుతోంది. కొండమీది గోగుపూలు రమ్మని చేతులు చాస్తున్నాయి. పండిన సీతాఫలాల సువాసన, రుచి, బతుకమ్మ ప్రసాదాలు తిన్నాక చాలా గంటల వరకు చేతికంటిన కమ్మని సువాసన కోసం మళ్లీ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపు! స్త్రీలు పాడే పాటలు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పేర్పులోని నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ కళాత్మక భావనల్నిచూసి వారిపై ఎనలేని ప్రేమ, గౌరవం కలిగేది. ఊరు ఊరంతా ఒక్కటై చేసుకునే పండుగ పట్ల గౌరవం ఇనుమడించేది. పండుగ కాలంలో స్త్రీలు మిగతా వాళ్ళని గౌరవంగా చూసేవాళ్ళు. అందరూ సమానమే. ఎందుకంటే అందరూ సుమంగళులే. అంటే గర్భం ధరించి పిల్లల్ని కనగలిగే అర్హత ఉన్నవాళ్ళే. వాళ్లే బతుకమ్మ ఆడాలి. వాయనాలు పెట్టుకోవాలి.– జయధీర్ తిరుమలరావు -
Dussehra 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?
‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలోకాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలోబతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైంది బొడ్డెమ్మ పండగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి దీన్ని ప్రారంభించుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభించి తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి,ఘ ఆటపాటలతో గౌరీ దేవిని పూజించి, తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు.బతుకమ్మ బిడ్డె బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి కూడా అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.బొడ్డెమ్మ పండుగను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ , పందిరి బొడ్డెమ్మ, బాయి(వి) బొడ్డెమ్మ. పీటమీద పూజించే బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ అనీ, గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అనీ, పందిరిలా అలంకరించే బొడ్డెమ్మను 'పందిరి బొడ్డెమ్మ', బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని పిలుచుకుంటారు. ఆకారం ఏదైనా, పూజా విధానం మాత్రం ఒకేలా ఉంటుంది.బొడ్డెమ్మ ఆటలుభాద్రపద బహుళ పంచమి నుంచి చతుర్ధశి వరకు బొడ్డెమ్మ ఆడతారు. చెరువు మట్టి లేదా పుట్ట మట్టిని తెచ్చి చెక్కపీటపై ఐదు దొంతరులుగా వలయాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దీన్ని ఎర్రమట్టితో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో అలంకరించి, ముగ్గులు వేస్తారు. ఐదు అంతస్తులపైన కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. పైన కొత్త గుడ్డతో చుట్టి తమలపాకులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ గౌరమ్మకు ఉదయం ఇంట్లో భక్తితో పూజింజి సాయంత్రం ఇంటి వాకిట్లో అలుకు చల్లి చుక్కల ముగ్గులు వేసి పీట బొడెమ్మను తెచ్చి ప్రతిష్టించి సాయంత్రం పూసే ఉద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి ఫలహారాలు పెట్టి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతారు. చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలు పాడుతారు. పాడడం అయిపోయాక తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుని బొడ్డెమ్మను ఎవరింట్లో ఆడుతున్నారో వారింట్లోనే దేవుని దగ్గర పెట్టి వెళ్లిపోతారు. ఇలా తొమ్మిదిరోజులు ఆడిన తర్వాత చివరిరోజు సాగనంపే పాటలు పాడి బావిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను బావిలో వేసిన తెల్లారి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా, అక్టోబరు 2వ తేదీనుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు షురూ అవుతాయి. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నేతృత్వంలో గురువారం బొడ్డెమ్మ పూజను ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో వేడుకలకు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పూజ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రత్యేకించి సెలవు లేకున్నా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణలో అనాధిగా వస్తున్నబతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. మట్టితో చేసిన బోడెమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కోపెల్లోని ఆండ్ర్యూ బ్రౌన్ పార్క్లో జరిగే చిన్న బతుకమ్మ, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేయాలని కోరారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలకు సుమారుగా 10,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
ప్రిస్కో : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరో కోల్.. అంటూ బొడ్డెమ్మ పాటలు ఫ్రిస్కోలో మార్మోగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండగను ఘనంగా జరిపారు. చిన్న బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. ఆడపడుచులు బొడ్డెమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో 100మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. బతుకమ్మ టీమ్ ఛైర్ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్ మంజూల తోడుపునూరి, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించాలని టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్ కమిటీ ఛైర్ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్, చంద్రా పోలీస్లు ప్రణాళికలు సిద్దం చేశారు. కొపెల్లో అక్టోబర్ 8న ఎంగిలిపూలు బతుకమ్మ, అక్టోబర్ 13న అల్లెన్ ఈవెంట్ సెంటర్లో సద్దులు బతుకమ్మ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఘనంగా బొడ్డెమ్మ పండగ
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్ మారగోని నవీన్కుమార్గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
డల్లాస్ : డల్లాస్లో బొడ్డెమ్మ పండుగతో అప్పుడే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్( టీపీఏడీ) ఆధ్వర్యంలో బంతుకమ్మ పండుగకు మందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. డా. పెప్పర్ ఏరియన్ ఫ్రిస్కోలో అక్టోబర్ 8న బతుకమ్మ జరిపే సంబురాలకు ముందు టెక్సాస్లో ఇర్వింగ్లోని నార్త్ లేక్ రాంచ్ పార్క్లో బొడ్డెమ్మ పండుగను జరిపారు. బతుకమ్మ పాటలతో బొడ్డెమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఆ ప్రాంతాన్నంతా హోరెత్తించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరన్ పోరెడ్డి, కో కన్వీనర్ సుమన బసాని, మాజీ కన్వీనర్ మాధవి సుంకి రెడ్డి, రమణ లష్కర్(జాయింట్ సెక్రటరీ), ఛైర్ ఆఫ్ బోర్డ్ ట్రస్టీ రామ్ అన్నాడి, టీపీఏడీ సలహాదారులు ఇందు పంచేరుపుల, సంతోష్ కోరె, అజయ్ రెడ్డి చైర్మన్, రఘువీర్ బండారు వైస్ ఛైర్మన్, టీపీఏడీ వ్యవస్థాపక కమిటీ సభ్యులు రావు కల్వల, జానకి మందాడి, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోందీ, బోర్డు ట్రస్టీలు పవన్ గంగాధర, గంగదేవర, అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసగాని, మాధవి సుంకి రెడ్డి, రాజేందర్ తొడిగాల, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పేర్కాని, రవికాంత్ మామిడి, శరత్ ఎర్రం, రూప కన్నవాగరి, రోజ ఆడెపు, సతీష్ జనుంపల్లి, వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, రవి శంకర్ పటేల్, అఖిల్ చిదిరాల, సునిల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కల్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్నా వుప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, వసుధారెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెల్లలు కార్యక్రమం విజయవంతలో తమ వంతు కృషి చేశారు. బతుకమ్మ పండగకు కోసం టీపీఏడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను అజయ్ రెడ్డి ఏలేటి వివరించారు. బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొనే దాదాపు 10 వేల మంది కోసం కమిటీ సభ్యులు, వాలంటీర్లతో కలిసి స్టేడియాన్ని ముస్తాబు చేయనున్నట్టు అజయ్ పేర్కొన్నారు.