cm biren singh
-
సీఎంకు తప్పిన ప్రమాదం..ఎయిర్ ఇండియాకు చురకలు
గువహటి: మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో అకస్మాత్తుగా పక్షి అడ్డం రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా సీఎం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు జరిగిన ప్రమాదంపై బీరేన్ సింగ్ ట్విటర్లో వెల్లడించడంతో పాటు.. ప్రయాణీకులకు సరైన సౌకర్యాలుకల్పించలేకపోయిందంటూ ఎయిర్ ఎండియా యాజమాన్యంపై స్వయంగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. గువహటి ఎయిరిండియా విమారం ఇంపాల్ వెడుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 160 మందితో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, కానీ గువహటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని శుక్రవారం బీరేన్ ట్వీట్ చేశారు. పక్షి తాకి వుంటే.. రంధ్రం పడేదనీ.. కానీ అప్పటికే విమానం ల్యాండ్ అవుతూ వుండడంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అక్కడి మేనేజ్మెంట్ తీరు అస్సలు బాగోలేదంటూ, వసతులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బీరేన్ ట్విటర్లో ఆరోపించారు. ఇంకా చాలామంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం, వసతి లాంటివేవీ లేదన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం అందుబాటులో లేదని కూడా అధికారులు తెలిపినట్లు బీరేన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ఎ యిరిండియాకూడా స్పందించింది. ప్రమాద విషయాన్ని ధ్రువీకరించిన సంస్థ అధికార ప్రతినిధి.. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోలకతానుంచి తమ ఇంజనీర్ల బృందం పరిశీలనకు వెళ్లినట్టు చెప్పారు. అలాగే మరో విమానం ద్వారా ఈ మధ్యాహ్నానికి సంబంధిత ప్రయాణీకులను ఇంపాల్ చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. -
నెలరోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా
ఇంఫాల్: మణిపూర్లో బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్పై అసంతృప్తితో సీనియర్ మంత్రి ఎల్ జయంత్ కుమార్ రాజీనామా చేశారు. తన శాఖలో సీఎం మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖతో సహా మూడు కీలకమైన శాఖలు నిర్వహించేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీరెన్ సింగ్ ఢిల్లీ పయనమయ్యారు. మార్చి 15న బీరెన్, ఆయన మంత్రి వర్గ సభ్యులు ప్రమాణం చేశారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను... కాంగ్రెస్కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్లు చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ, టీఎంసీ చెరోక సీటు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్జేపీ, టీఎంసీ మద్దతును కూడగట్టి... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జయంత్ కుమార్ ఎన్పీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్పీపీకి చెందిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినా వారు తమ శాఖల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.