Coastal Clean Up Day
-
కాలుష్యంతో మత్స్య సంపదకు ముప్పు
కోస్టుగార్డు కమాండెంట్ వేణుమాధవ్ కృష్ణపట్నం తీరంలో కోస్టల్ క్లీనప్ డే ప్రారంభం ముత్తుకూరు : సముద్ర జలాల కాలుష్యంతో మత్స్యసంపదకు ముప్పు ఏర్పడుతుందని ఇండియన్ కోస్టు గార్డు కమాండింగ్ ఆఫీసర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. కృష్ణపట్నం తీరంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్డేను శనివారం ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛసాగర్ అభియాన్ దివాస్’గా ప్రకటించిందని గుర్తు చేశారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నాశనం కావని, మత్స్య సంపదకు ఆహారమైన ప్లాంటాన్ల ఉనికికే ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనంతో తీరం పొడవున్నా చెత్త పేరుకుపోయిందని విచారం వ్యక్తం చేశారు. సముద్రతీరం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు తీరంలోని చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆరాధ్య భరద్వాజ్, పోర్టు మెరైన్ డీజీఎం షఫీ, ట్రీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ప్రారంభించిన కిరణ్ బేడీ
పుదుచ్చేరిః లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పుదుచ్చేరీలో కోస్టల్ క్లీనప్ డ్రైవ్ ను ప్రారంభించారు. కోస్ట్ గార్డులు, వాలంటీర్లు నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ బేడీ ప్రముఖ అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతిని గౌరవించి, బీచ్ లను చెత్తా చెదారంతో నింపడం మానాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా బీచ్ లలోని చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కోస్ట్ గార్డు సిబ్బంది చేపట్టారు. కార్యక్రమానికి ముందు బేడీ సహా స్థానిక పరిపాలనా మంత్రి ఎ నమశ్శివాయం.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సభ్యులైన ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్, ఎన్జీవో సభ్యులతో గార్బేజ్ ఫ్రీ బీచెస్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాలంటీర్లతో కలసి కిరణ్ బేడీ, మంత్రి నమశ్శివాయం, పలువురు అధికారులు సైతం బీచ్ లలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ డ్రైవ్ లో భాగంగా బీచ్ లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని పుదుచ్చేరిలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు కమాండర్ ఎస్ సి త్యాగి తెలిపారు. స్థానిక పరిపాలనా విభాగంతో కలసి ఇండియన్ కోస్ట్ గార్డు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.