coffee plantation
-
అరకు ఆర్గానిక్ కాఫీ.. అలా విదేశాలకు ఎగిరింది!
ఈ తరానికి ‘ఫ్యాన్సీ’గా అనిపించే వైజాగ్–అరకు ‘గ్లాస్ రైల్’కు ‘అరకు కాఫీ’కి ఒక దగ్గర పోలిక ఉంది. కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ ఆ రైలు పట్టాలు వేసింది ‘డీబీకే’ రైల్వే లైన్ (దండకారణ్య–బోలానగిర్ – కిరుబురి) కోసం. ముడి ఇనుమును విశాఖపట్టణం పోర్టు నుంచి జపాన్ ఎగుమతి కోసం 1960లో దీన్ని వేశారు. తొలితరం గిరిజన జాతుల జీవితంలోకి ఈ ‘ప్రాజెక్టు’ తెచ్చిన మార్పులో ఆ తర్వాత కాలంలో కాఫీ కూడా భాగమైంది. తూర్పు కనుమల్లో ఒక్క విశాఖ మన్యసీమ మాత్రమే ఎందుకు ‘కాఫీ’కి నెలవయింది అంటే, ఇది సముద్ర మట్టానికి 900–1100 అడుగుల ఎత్తున ఉంది. వర్షపాతం 1000–1200 మి.మీ. ఉండి, కాఫీ మొక్క వేళ్ళకు తడి తగిలితే చాలు కనుక ఇక్కడి కొండవాలులు వీటి పెంప కానికి అనువు అయ్యాయి. ఎండ నేరుగా ఈ మొక్కలకు తగలకూడదు కనుక, నీడ కోసం పెంచే సిల్వర్ వోక్స్ చెట్లు (Silver Oak Trees) కూడా ఈ నేలలో బాగా పెరగడంతో అంతర పంటగా పెంచే మిరియాల పాదులు ఈ చెట్ల మధ్య పెంచుతారు. గిరిజనులకు అదొక అదనపు ఆదాయం.అటవీ శాఖ 1960లో అరకు, అనంతగిరి, చింతపల్లి, పాడేరు రిజర్వ్ ఫారెస్ట్లో కాఫీ తోటల (Coffee Plantation) పెంపకం మొదలు పెట్టింది. దాంతో సాగులో మెలకువలు, సాంకేతిక అంశాలు చూడడానికి కాఫీ బోర్డ్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం కూడా ఏజెన్సీకి వచ్చింది. అలా అటవీ శాఖ పెంచిన తోటలు 1985లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్కు అప్పగించే నాటికి వాటి విస్తీర్ణం 10,100 ఎకరాలు. ఇక ఎనభైల్లో పాడేరు ఐటీడీఏ (ITDA) వచ్చాక, విశాఖ ఏజెన్సీకి ఊరట కోసం వారాంతపు యాత్రలకు వచ్చే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ‘వీఐపీ’లకు ఐటీడీఏ అధికారులు చూపించే ఒక టూరిస్ట్ స్పాట్గా మన్యసీమలో ఈ కాఫీ తోటలు మారాయి.అయితే వీటి విస్తీర్ణం 2002–03 నాటికి అరవై వేల ఎకరాలకు చేరినా, ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని అయ్యాక మాత్రమే, ‘గిరిజన్ కాఫీ’కి వాణిజ్యపరమైన విలువ పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ‘డవున్–టు–ఎర్త్’ ధోరణి కనుక, ముందు ‘భూమి’ – ‘మనిషి’, ఆ తర్వాతే కాఫీ అయినా దాని రుచి అయినా... అన్నట్టుగా మన్యం ‘కాఫీ’ గురించి ఆయన ఆలోచించారు. ప్రభుత్వం పెంచిన కాఫీ తోటలపై స్థానిక గిరిజనులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చి వాళ్ళ తోటల్లో వాళ్ళు తమ పని చేసుకుంటుంటే, దాన్ని– ‘నెరేగా’ ఉపాధి హామీ క్రిందికి వైఎస్ తెచ్చారు. గిరిజనుల పట్ల ఆయన ధోరణి ఇటువంటిది కనుకనే, నక్సలైట్లను – ‘అయినా మీరు ఇంకా అడవుల్లో ఎందుకు బయటకు రండి’ అని చర్చలకు పిలిచారు.అరకు కాఫీ (Araku Coffee) తోటల పచ్చని భూముల కింది పొరల్లో బాక్సైట్ ఖనిజముంది. దాన్ని అల్యూమినియంగా మార్చి వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు 2009 నాటికే మన్యం ముఖద్వారం వద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుని మరీ కనిపెట్టడం మొదలెట్టాయి. సరిగ్గా అప్పుడే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయిన డాక్టర్ జైరాం రమేష్ (Jairam Ramesh) కేంద్ర మంత్రి అయితే, ఆయన చేసిన అటవీ–వాణిజ్య శాఖల సేవలను వైఎస్ గిరిజనుల కాఫీ తోటల కోసం పూర్తి స్థాయిలో వాడుకున్నారు. కేంద్ర ‘ఉపాధి హామీ’ నిధులు 2009–10, మళ్ళీ 2015–16 మధ్య ఇలా రెండుసార్లు రూ. 287 కోట్లు, కాఫీ బోర్డు నిధులు రూ. 62 కోట్లతో 1.04 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు, మరొక లక్ష ఎకరాల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం ‘షేడ్ ప్లాంటేషన్’ మొక్కలు ఆ కాలంలో నాటారు.చదవండి: ప్రైవేటు ఎత్తులకు చిత్తవ్వాల్సిందేనా?అయితే మన ‘కాఫీ కథ’ ఆ తోటల్లోనే ఆగిపోలేదు. కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య సహాయ మంత్రిగా 2009 ఆగస్టు 13న ‘ఆసియాన్’ 49 దేశాలతో మన దేశం చేసు కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక (ఎఫ్టీఏ) రూప కల్పనలో మంత్రి జైరాం రమేష్ది కీలక పాత్ర అయింది. ఆ ఒప్పందం 2010 జనవరి 1 నుండి అమలులోకి వచ్చేది. కానీ, వైఎస్ ఒత్తిడితో సీఎంఓ డిల్లీతో చేసిన నిరంతర ‘లాబీయింగ్’తో మన దేశం ఎగుమతి చేసే 489 వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో మన ‘గిరిజన్ కాఫీ’కి చోటు దొరికింది. ఒప్పందం ముగిసిన నెలకు ఆయన లేరు. ఇది జరిగిన మూడు నెలలకు మన గిరిజన్ కాఫీ ‘అరకు ఆర్గానిక్ కాఫీ’ బ్రాండ్తో రెక్కలు కట్టుకుని మరీ విదేశాలకు ఎగిరింది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మన్యంలో కాఫీ సిరులు
కొండాకోనా చదునుచేసి, తుప్పా డొండా తగలబెట్టి పోడు కొట్టి నాలుగు గింజలు పండించి కడుపు నింపుకునే గిరిజనులు ఇప్పుడు పంథా మార్చారు. వాణిజ్య పంటల సాగుతో మైదాన ప్రాంత రైతులకు దీటుగా దూసుకుపోతున్నారు. పోడును పక్కన పెట్టి కాఫీ తోటల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశాబ్దాల కిందట మన్యంలో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం ఇంతింతై వేల ఎకరాలకు విస్తరించింది. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏల తోడ్పాటుతో గిరి రైతులు అద్భుతాలే చేస్తున్నారు. సాక్షి,పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అడవిని నరికి పోడు వ్యవసాయం చేసుకుని దుర్భర జీవనం సాగించే గిరిజన రైతులు నేడు కాఫీ తోటల సాగుతో ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు.1967లో జి.కే.వీధి మండలం ఆర్.వి.నగర్, అనంతగిరి, మారేడుమిల్లి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కేంద్ర కాఫీ బోర్డు మూడు ఎకరాల్లో అరబికా రకం కాఫీ తోటల సాగు ప్రారంభించింది. గిరిజనులకు భాగస్వామ్యం చేస్తూ కేంద్ర కాఫీ బోర్డు చేసిన ఈ ప్రయత్నం వృథా కాలేదు.గిరిజనులను పోడు వ్యవసాయం నుంచి దూరంగా పెట్టి వారితో కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ మొక్కలు నాటించి అవి బాగా ఎదిగిన తరువాత ఆ మొక్కల మధ్య కాఫీ మొక్కలు నాటించారు. దీంతో 1967 నుంచి ఏటా మన్యంలో కాఫీ తోటలు విస్తరిస్తూ వచ్చాయి. కేంద్ర కాఫీబోర్డుతో పాటు పాడేరు ఐటీడీఏ కాఫీ తోటలు విస్తరించేందుకు గిరిజన రైతులకు మొక్కలతో పాటు ఆవి ఎదిగేంతవరకు ఆర్థిక భరోసా కల్పించాయి. కాఫీ రైతులకు ఫల్పింగ్ యూనిట్లు, ఇతర యంత్రాలు, ఇంటి ముందు సిమెంట్ కళ్లాలు కూడా నిర్మించాయి. 2,59,947 ఎకరాల్లో కాఫీ సాగు పాడేరు డివిజన్లోని 11మండలాలతో పాటు రంపచోడవరం డివిజన్లోని మారేడుమిల్లి ప్రాంతంతో కలుపుకుని ప్రస్తుతం 2,59,947 ఎకరాల్లో కాఫీతోటలు సాగవుతున్నాయి. 2,45,800మంది గిరిజన రైతులు కాఫీ సాగు ద్వారా ఉపాధి పొందుతున్నారు. 1967లో జి.కే.వీ«ధి మండలం ఆర్.వి.నగర్లో కేంద్ర కాఫీ బోర్డు కాఫీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో మూడు ఎకరాలతో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం వేల ఎకరాలకు విస్తరించడం వల్ల గిరిజనులకు ఉపాధి దొరకడంతో పాటు కొండపోడు భూములన్నీ ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎకరానికి రూ.50వేల వరకు ఆదాయం గిరిజన రైతులు కాఫీతోటలను సేంద్రియ పద్దతిలోనే సాగు చేస్తుండడంతో ఇక్కడి కాఫీ నాణ్యతలో నంబర్ వన్గా నిలుస్తోంది. ఎకరానికి 500 కిలోల వరకు కాఫీపండ్ల దిగుబడి వస్తుంది. వీటిని పల్పింగ్ చేసి 80 నుంచి 160 కిలోల వరకు పాచ్మెంట్ కాఫీగింజలను గిరిజన రైతులు అమ్ముతారు. అలాగే కాయలను నేరుగా ఆరబెట్టి చెర్రీ రకంగాను అమ్ముతుంటారు.ప్రస్తుతం మొత్తం తోటల్లో 2,01,947 ఎకరాల కాఫీ తోటలు మాత్రమే ఏటా ఫలసాయం ఇస్తున్నాయి. 14 వేల మెట్రిక్ టన్నుల పాచ్మెంట్ కాఫీ గింజలను గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుండటంతో గిరిజన రైతులకు ఏటా కాఫీ పంట జీవనోపాధి కల్పించి ఆదుకుంటోంది. గత మూడేళ్లలో సాగు చేసిన కాఫీతోటలు కూడా వచ్చే ఏడాది నాటికి ఫలసాయం ఇవ్వనున్నాయి. ఈ ఏడాది మరింత డిమాండ్ మన్యంలో గిరిజన రైతులు సాగు చేసే నాణ్యమైన కాఫీ గింజలకు బెంగళూరు మార్కెట్లో డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లో పాచ్మెంట్ కాఫీ గింజలకు కిలో రూ.450 వరకు ధర పలుకుతుండటంతో ఏజెన్సీలోని జీసీసీ, ఐటీడీఏతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎన్జీవోలు, ప్రైవేట్ వ్యాపారులంతా పోటాపోటీగా గిరిజన రైతుల నుంచి కాఫీ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఎజెన్సీలో పాచ్మెంట్ కాఫీ గింజల ధర కిలో రూ.350 పలుకుతోంది. దీంతో ఈఏడాది ఎకరానికి అదనంగా మరో రూ.20 వేలు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పోడు వ్యవసాయం మానేసాం పూర్వం మోదాపల్లి ప్రాంతంలో అడవిని నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లం.1975లో కాఫీ మొక్కలను తమ తండ్రులు నాటుకున్నారు.1980 నుంచి కాఫీతోటల ద్వారా ఆదాయం పొందుతున్నాం. మాకు మూడున్నర ఎకరాల కాఫీతోటలు ఉన్నాయి.నా ఇద్దరు కొడుకులకు.నాకు ఈ కాఫీతోటే ఆధారం. ప్రతి ఏడాది రూ.1లక్షా 50వేల వరకు ఆదాయం వస్తుంది. – డిప్పల హసన్న కాఫీ రైతు, మోదాపల్లి, పాడేరు మండలం మార్కెటింగ్ సేవలు మరింత విస్తరించాలి కాఫీతోటల సాగుతో ఏటా గిరిజన రైతులకు మంచి ఆదాయం వస్తున్నప్పటికీ, మార్కెటింగ్ సేవలను మరింత విస్తరించాలి. బెంగళూరు మార్కెట్లో ఈఏడాది పాచ్మెంట్ గింజలకు కిలో రూ.450 ధర ఉన్నప్పటికీ జీసీసీ, ఇతర సంస్థలన్నీ కిలో రూ.350 తోనే కొనడం వల్ల మరింత ఆదాయాన్ని కోల్పోతున్నాం. బెంగళూరు కాఫీ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమం సంఘం నేత, పాడేరు దిగుబడులు పెంచేందుకు చర్యలు ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్దతుల ద్వారానే కాఫీపంట దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీతోటలు గిరిజనులకు వరమనే చెప్పాలి.కాఫీతోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కేంద్ర కాఫీబోర్డు అన్ని విధాల ప్రోత్సహిస్తుంది. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. – సమల రమేష్ సీనియర్ లైజన్ అధికారి, కేంద్ర కాఫీబోర్డు మినుములూరు -
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
రూ. 596 కోట్లతో విశాఖలో కాఫీ ప్లాంటేషన్
విశాఖపట్నం : దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో రూ.596కోట్ల అంచనా వ్యయంతో ఒకేసారి లక్ష ఎకరాల్లో భారీఎత్తున కాఫీ ప్లాంటేషన్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్బాబు వెల్లడించారు. శుక్రవారం విశాఖ జీసీసీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అటవీ విస్తీర్ణత 33 శాతం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏపీలో కేవలం 24 శాతం మాత్రమే ఉందనీ, అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమేనన్నారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కోసం సగం నిధులు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి సమకూర్చుతుండగా, మిగిలిన సగం నిధులు కాఫీ బోర్డు సబ్సిడీ రూపంలో అందజేస్తుందన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది గిరిజనులకు ఉపాధి లభించనుందన్నారు. ఇంత భారీ ఎత్తున ప్లాంటేషన్ చేపట్టడం దేశంలోనే ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది గిరిజన సబ్ప్లాన్ కోసం రూ. 1900 కోట్లు బడ్జెట్లో కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు.