గోల్డ్కోస్ట్లో కలుద్దాం...
వైభవంగా కామన్వెల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవం
గ్లాస్గో: స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో 11 రోజుల పాటు విజయవంతంగా జరిగిన 20వ కామన్వెల్త్ గేమ్స్కు ఆదివారం రాత్రి తెర పడింది. అథ్లెటిక్స్ పోటీలు జరిగిన హాంప్డెన్ పార్క్ నేషనల్ స్టేడియంలో గంటన్నర పాటు జరిగిన ముగింపు వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వేడుకల్లో పాల్గొన్న బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సమక్షంలో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వైస్ ప్యాట్రన్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఈ గేమ్స్ ముగిసినట్టు ప్రకటించారు. 21వ గేమ్స్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరుగుతాయి. ముగింపు కార్యక్రమం పూర్తిగా సంగీతభరిత వాతావరణంలో సాగింది. 2వేల మందికి పైగా కళాకారులు స్కాటిష్ సింగర్స్ లులు, డీకన్ బ్లూ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు.
ఈ సమయంలో లేజర్ షో, బాణసంచా వెలుగులతో స్టేడియం ఆకర్షణీయంగా కనిపించింది.
►వందలమంది డ్రమ్మర్స్, బ్యాగ్పైపర్స్, అధికారులు స్టేడియంలో చేసిన మార్చ్పాస్ట్ అలరించింది.
►చివర్లో ఆసీస్ పాప్ సింగర్ 46 ఏళ్ల కైలీ మినోగ్, జెస్సికా మౌబాయ్ తమ ఆట పాటలతో వేడుకల ఉత్సాహాన్ని మరింత పెంచారు.
►కైలీ తన సూపర్ హిట్ ఆల్బమ్స్తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సమయంలో వేదికపైకి దూసుకొచ్చి నృత్యం చేద్దామనుకున్న ఓ మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
►డిస్కస్ త్రోయర్ సీమా పూనియా భారత ఆటగాళ్ల తరఫున జాతీయ పతాకాన్ని చేతపట్టి స్టేడియంలోకి ప్రవేశించింది.
►కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే గ్లాస్గో అత్యద్భుతంగా ఆతిథ్యమిచ్చిందని పోటీల చీఫ్ ప్రిన్స్ ఇమ్రాన్ ప్రకటించారు.
►కెనడాకు చెందిన రిథమిక్ జిమ్నాస్ట్ ఫ్రాంకీ జోన్స్ ఉత్తమ అథ్లెట్గా నిలిచింది.