అమ్మో డేరా బాబా.. 600 అస్థిపంజరాలు
సిర్సా : డేరా సచ్చా సౌదా గురించి మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. మనుషులను చంపి కూడా అందులో పాతిపెట్టారనే విషయాలు ఇప్పటికే వెలుగు చూడగా అలా పాతిపెట్టినవారి సంఖ్య ఒకటో రెండో లేక ఏ పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 600కు పైగా అస్థిపంజరాలు డేరా సచ్చా సౌదాలో వెలుగుచూశాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆశ్రమం అంతటా చేసిన తనిఖీల్లో కళ్లు చెదిరే సంఖ్యలో ఈ అస్థిపంజరాలు వెలుగుచూసినట్లు కీలక వర్గాల సమాచారం. ప్రతి అస్థిపంజరంపైనా అందమైన పూల మొక్కలు నాటినట్లు వెల్లడైంది.
అయితే, అవన్నీ డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ చంపేసినవారి అస్థిపంజరాలు కాదని, మోక్షం కోసం చనిపోయిన వారి మృతదేహాలను ఆశ్రమంలో పాతిపెట్టేందుకు బాబా అనుమతించారని డేరా బాబా అనుచరులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, హర్యానాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు రామానంద్ తాతియా మీడియాతో మాట్లాడుతూ డేరా క్యాంపస్లో మరిన్ని తవ్వకాలు జరపాలని, కనిపించకుండా పోయిన దాదాపు 500 మంది జాడలు ఆ తవ్వకాల్లో బయటపడతాయని ఓ మీడియాకు చెబుతూ అన్నారు. చాలా దారుణంగా గుర్మీత్ హత్యలు చేసేవారని, రహస్యంగా వారిని ఆశ్రమంలోనే పాతిపెట్టించేవాడని ఆరోపించారు. జాతీయ మీడియా సమక్షంలో ఆశ్రమంలో తవ్వకాలు జరపాలని కోరారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్కు 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే.