DPA
-
డైమండ్స్ అమ్మకాల్లో 7శాతం భారత్లో: డీపీఏ
ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్ అమ్మకాల్లో భారత్ వాటా 7 శాతానికి చేరింది. ఇక్కడ అపార వ్యాపార అవకాశాలున్నాయని డైమండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డీపీఏ) పేర్కొంది. వజ్రాల అమ్మకాలను పెంచేందుకు జెమ్ జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్తో కలిసి పనిచేయనున్నట్టు అసోసియేషన్ ఇండియా ఎండీ రిచా సింగ్ తెలిపారు. అల్రోసా, డీ బీర్స్, డోమినియన్ డైమండ్, జెమ్ డైమండ్స్, లుకారా డైమండ్, పెట్రా డైమండ్స్, రియో టింటో వంటివి డీపీఏలో సభ్య కంపెనీలుగా ఉన్నాయి. -
మేమూ రెఢీ!
డీపీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మహిళానేత, సినీ నటి ఖుష్బూ రెడీ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖుష్బూ, ఐదో తేదీ నుంచి కనిమొళి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఓపెన్ టాప్ వాహనాలు వీరి కోసం సిద్ధం అవుతున్నారుు. సీఎం జయలిలత వాగ్దాటిని ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు మహిళలు సిద్ధమయ్యారు. సాక్షి, చెన్నై: వీసీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, పీటీలతో కలసి డీఎంకే నేతృత్వంలో డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్(డీపీఏ) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పదుచ్చేరితో పాటుగా రాష్ర్టంలోని 40 స్థానాల బరిలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రచార బాటలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. తాను సైతం అంటూ పార్టీ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి సీఎం జయలలిత ఒంటి చేత్తో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తుంటే, ఆమె వాగ్దాటిని ఎదుర్కొనే విధంగా మహిళా నాయకుల్ని ప్రచార కదన రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధం అయింది. కని, ఖుష్బూ రెడీ జయలలిత తమ మీద విమర్శల వర్షం కురిపిస్తుండటంతో దాన్ని తమ వాగ్దాటితో తిప్పికొట్టే విధంగా ప్రచారంలోకి ఎంపీ కనిమొళి, నటి ఖుష్బూలు రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ గ్లామర్ ఖుష్బూను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాక్ చాతుర్యంతో, చక్కటి ప్రసంగంతో ఓటర్లను ఆమె ఆకర్షించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు డీఎంకే నిర్ణయించింది. ఇది వరకు వేదికలపై నుంచి ప్రసంగాలు ఇచ్చిన కనిమొళి, ఈ పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా జయలలిత ప్రసంగాల్ని టార్గెట్ చేసి, ఆమె వ్యాఖల్ని దీటుగా ఎదుర్కొనే రీతిలో ఈ ఇద్దరు మహిళు తర్ఫీదు పొందుతున్నారని సమాచారం. కనిమొళికి చక్కటి ప్రసంగాన్ని ఇవ్వగల సత్తా ఉంది. ఖుష్బూ అనర్గళంగా ప్రసంగించగలరు. అయితే, కొన్ని అంశాల్ని ఎత్తి చూపాల్సిన సమయంలో స్క్రిప్ట్ తప్పని సరి. పర్యటన వివరాలు కనిమొళి పర్యటన వివరాలు సిద్ధం చేసే పనిలో అన్నా అరివాళయం వర్గాలు ఉన్నాయి. ఆమె ఏప్రిల్ 5 తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్టాలిన్ కన్యాకుమారి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్న దృష్ట్యా, చెన్నై నుంచి ఆమె ప్రచారం ఆరంభించే రీతిలో పర్యటన వివరాల్ని సిద్ధం చేస్తున్నారు. లేని పక్షంలో కనిమొళి మద్దతుదారులు అత్యధికంగా ఉండే కడలూరు, చిదంబరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఖుష్బూ పర్యటన వివరాలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి పార్టీకి సేవలను అందించేందుకు ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పర్యటన సాగనుంది. వీరు రోడ్ షోలలో కూడా పాల్గొని ప్రచారం చేయనున్నారు. ప్రధాన కూడళ్లల్లో ప్రసంగాలు, అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీరి ప్రచారం కోసం అన్ని వసతులతో కూడిన రెండు ఓపెన్ టాప్ వాహనాలు సిద్ధం అవుతున్నాయి. జయను ఎదుర్కోవడానికే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారానికి అనూహ్యస్పందన రావడంతోనే ఈ ఇద్దరినీ రంగంలోకి దించేందుకు కరుణానిధి నిర్ణయించినట్టు అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్లు చీలడం ఖాయం. ఈ దృష్ట్యా, తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం బరిలోకి అందరినీ దించే పనిలో కరుణానిధి ఉన్నారు. -
డీపీఏ ఆవిర్భావం!
డీఎంకే అధినేత ఎం కరుణానిధి నేతృత్వంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసి వ్ అలయన్స్(జననాయగ ముర్పోక్కు కూట్టని) బుధవారం ఆవిర్భవించింది. ఈ కూటమిలో ని పార్టీల సీట్ల పందేరాలు కొలిక్కి వచ్చాయి. లోక్సభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటనకు డీఎంకే సిద్ధమవుతోంది. సాక్షి, చెన్నై : యూపీఏతో కటీఫ్ తర్వాత కాంగ్రెస్పై డీఎంకే అధినేత ఎం కరుణానిధి విరచుకుపడుతూ వచ్చారు. ఇక ఆ పార్టీతో కూటమి లేదని తేల్చారు. అయితే, కాంగ్రెస్ పెద్దలు గోపాలపురం మెట్లు ఎక్కుతూ ఉండడంతో వీరి బంధం మళ్లీ బలపడే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, కరుణానిధి మాత్రం మెట్టు దిగలేదు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను తమతో కలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం తో ఒంటరిగా తన సత్తాను చాటుకునే పనిలో పడ్డారు. డీఎంకేతో కలసి పనిచేయడానికి తాము రెడీ అని వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, పుదియ తమిళగం, మనిద నేయమక్కల్ కట్చిలు ప్రకటించాయి. పలు సామాజిక వర్గాలతో నిండిన ఈ పార్టీలతో కలసి ఎన్నికలు ఎదుర్కొనేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది. డీపీఏ ఆవిర్భావం: వీసీకే, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, పుదియ తమిళగంలు ఎన్నికల్లో పోటీకి నిర్ణయించడంతో వారికి సీట్ల కేటాయింపులు జరిగాయి. వీసీకేకు రెండు, మిగిలిన పార్టీలకు తలా ఓ సీటు కేటారుుంచారు. అలాగే, ఈ పార్టీలతో పాటుగా డీఎంకేతో కలసి పనిచేయడానికి ద్రవిడ కళగం, ఎంజీయార్ కళగం, పెరుంతలైవర్ మక్కల్ కచ్చి, ఇండియ దేశీయ లీగ్, ఇండియ ఫార్వడ్ బ్లాక్, ఉలవర్ ఉలై పాలర్ తదితర 16 చిన్న పార్టీలు ముందుకు వచ్చాయి. దీంతో ఈ పార్టీల నేతలందరితో బుధవారం అన్నా అరివాళయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి భేటీ అయ్యారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సంయుక్త కార్యదర్శి దురై మురుగన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, ఎంజియార్ కళగం నేత ఆర్ఎం వీరప్పన్, ఇండియ యూనియన్ ముస్లీం లీగ్ నేత ఖాదర్ మోహిద్దీన్, వీసీకే నేత తిరుమావళవన్, పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, ఎంఎంకే నేత జవహరుల్లా, పెరుంతలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్ఆర్ ధనపాలన్, ఇండియ దేశీయ లీగ్ నేత తిరుప్పూర్ అల్తాఫ్, ఇండియ ఫార్వర్డ్ బ్లాక్ నేత సంతానం ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనే రీతిలో కార్యాచరణ సిద్ధంచేశారు. తమ కూటమికి డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్(డీపీఏ)గా నామకరణం చేశారు. తమకూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం తథ్యమని, కేంద్రంలో చక్రం తిప్పబోయేది తామేనన్న ధీమాను డీఎంకే మిత్రులు వ్యక్తం చేయడం విశేషం. ఈలం తమిళుల సంక్షేమ నినాద అస్త్రంతో ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఈ కూటమి నిర్ణయించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కూటమిలోకి కొత్తగా వచ్చే వాళ్లను ఇక చేర్చుకోబోమంటూ డీఎంకే అధిష్టానం ప్రకటించింది. మిత్రులందరూ సంతృప్తికరంగా ఉండడంతో ఇక తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు డీఎంకే సన్నద్ధం అవుతోంది.