duplicate chilli powder
-
కాదేదీ కల్తీకి అనర్హం!
► ఇబ్రహీంపట్నం డివిజన్లో చేలరేగుతున్న కల్తీ దందాలు ► విత్తనాలు మొదలు పాల వరకు అన్నీ కల్తీలే ► ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ► భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు ఇబ్రహీంపట్నం: కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం డివిజన్లో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాలు ఒక్కోటిగా బయటకొస్తున్నాయి. నకిలీ విత్తనాలు మొదలు కారం, పప్పు, ఆహార పదార్థాల నుంచి ఆఖరికి పసిపిల్లలు తాగే పాల వరకు అన్ని కల్తీలే. ఎస్ఓటీ, స్థానిక పోలీసులు, నిఘా వర్గాలు ఆక్రమ వ్యాపారాల, ఆహార పదార్థాల కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదో కంపెనీ పేరుతో అనుమతులు తీసుకొని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా ఆహారపదార్థాలను కల్తీలు చేస్తూ యదేశ్ఛగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రోజుకో ఘటన వెలుగు చూస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న కల్తీగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు..... పోలీసులు హెచ్చరికలు చేస్తున్న కల్తీగాళ్లు వాటిని బేఖాతరు చేస్తున్నారు. పట్టుబడితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ఈ తతంగం కొనసాగుతుంది. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, పీడీ యాక్ట్ను సైతం నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు హెచ్చరిస్తున్న వీరి అరచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. కల్తీ దందాలకు పాల్పడే వారికి తగిన రీతిలో దండన విధిస్తేనే తగ్గుతారేమో. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దుండగుల భరతం పట్టేందుకు ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులు, పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహారించాల్సివుంది. కల్తీల మూలాలను పెకిలించాలి.... కల్తీగాళ్ల ఆగడాలు అరికట్టాలంటే దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ కల్తీ వ్యాపారుల మూలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రజలు వాపోతున్నారు. మార్కెట్లోకి కల్తీ సరుకులు, విత్తనాలు, పాలు వస్తున్నాయంటే దానిని తయారు చేసే వారిపై... వాటిని కొనుగోలు చేసి ప్రజలకు అంటగడుతున్న వ్యాపారులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటేనే ఫలితం వుంటుందని విశ్లేషకులు అంటున్నారు. -
కల్తీ కారంపై ఉక్కుపాదం
► 11 లైసెన్సులు రద్దు ► గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ కొరిటెపాడు(గుంటూరు): కల్తీ కారం తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. యార్డు పరిపాలనా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్థం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. గత నవంబర్లో కోల్డ్ స్టోరేజీలు, కల్తీ కారం మిల్లులపై నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 25 వేల కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి 97 శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపగా వాటిలో సుమారు 58 సురక్షితం కాని, ప్రమాణాలు లేనివిగా నివేదికలు వచ్చాయని వివరించారు. మొత్తం 40 మిల్లుల్లో కల్తీ కారం ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వాటిలో 11 మిల్లులకు లైసెన్సులు ఉన్నాయని, మిగిలిన 29 మిల్లులకు లైసెన్సులు లేవని, లైసెన్సులు ఉండి కల్తీ కారం తయారు చేసిన 11 మిల్లుల లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్న మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు. పుడ్ అండ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వీరందరిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. కల్తీకి పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా వ్యాపారం చేయకుండా అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణ-రమేష్కుమార్ అండ్ కో, రమా సత్యదేవా చిల్లీస్, విజయ ఆదిలక్ష్మి ట్రేడర్స్, అనిల్ అండ్ కంపెనీ, వి.ఎం.స్పైస్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, వి.ఎం.ఆర్.స్పైసెస్ ప్రొడక్ట్స్, వర్షిణి జనరల్ ట్రేడింగ్ కంపెనీ, రజిత్ ఎక్స్పోర్ట్సు, వేగాస్ ప్రొడక్ట్స్, వోలేమ్ అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్, లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. సమావేశంలో యార్డు అధికారి సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యుడు శ్రీరాం రాజీవ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.