easy process
-
ఈజీగా డ్రైవింగ్ లైసెన్సు ..
లైసెన్స్ల జారీ విధానంలో రవాణాశాఖ సమూల మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటి వల్ల సులువుగా డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విశేషాలు.. వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తొండంగి (తుని): ద్విచక్రవాహనాలకు మోటార్స్ సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్ రెండు రకాల లైసెన్స్లు ఉండేవి. ఆటోలు నడిపేందుకు త్రీవీలర్ లైసెన్స్తోపాటు బ్యాడ్జి ఉండాలి. ట్రాన్స్పోర్టు ప్యాసింజర్ వెహికల్స్, గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్పోర్టు వెహికల్ నడిపేందుకు విడివిడిగా లైసెన్స్లు మంజూరు చేసేవారు. దీంతోపాటు ప్యాసింజర్, హెవీ గూడ్స్ వెహికల్ నడిపాలంటే బ్యాడ్జిని పొందాల్సి ఉంది. మూడేళ్ల అనుభవం ఉన్న వారికి బ్యాడ్జి మంజూరు చేసేవారు. లైట్ మోటార్ వెహికల్ నాన్ట్రాన్స్పోర్టు ఉంటే సొంత కారు, లైట్మోటార్ వెహికల్(ట్రాన్స్పోర్టు) ఉంటే నాలుగు చక్రాల కమర్షియల్ పాసింజర్ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు జారీచేసే వారు. వాహనాలు నడిపేందుకు లైసెన్స్ జారీ విధానంలో పలు నిబంధనలతో కూడిన పలు రకాలు లైసెన్సు రవాణాశాఖ జారీ చేసేది. వీటిని పొందేందుకు వాహన యజమానులు, డ్రైవర్లు గతంలో పుట్టిన తేదీ కోసం పాఠశాలలో చదివిన ధ్రువీకరణపత్రం, ఎల్ఐసీ బాండ్ పేపర్ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇవి లేక వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు కాక తనిఖీ సమయంలో అపరాధ రుసుములు కట్టాల్సిన పరిస్ధితి ఉంది. దీంతో వాహనదారులు వాహనాన్ని నడిపే అనుభవం ఎంత ఉన్నా లైసెన్సులేక రహదారులపై తనిఖీల సమయంలో అధికారులకు పట్టుబడి ఇబ్బందులుపడుతున్నారు. పాత నిబంధనలతో బీమావర్తింపునకు ఆటంకం ప్రస్తుతం ఇప్పటి వరకూ డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అమలు చేసిన నిబంధనలు బీమా వర్తింపునకు ఆటంకంగా మారేవి. రోడ్డుపై ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వాహనానికి చేయించిన బీమా వర్తించాలంటే కచ్చితంగా ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. అదే సందర్భంలో నిబంధనల ప్రకారం వాహన రకాన్ని బట్టి ఆయా కేటగిరీకి చెందిన లైసెన్సు నిబంధనల ప్రకారం పొంది ఉన్నాడా? లేదా? అన్న విషయంపై బీమా సంస్థలు విచారణ చేసేవి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బీమా క్లెయిమ్ను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనల మార్పు బీమా వర్తింపునకు సులభతరం కానుంది. నూతన విధానం ఇలా.. వాహనాలను నడిపేందుకు లైసెన్స్ మంజూరులో నిబంధనలు పూర్తిగా మార్పు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయని కత్తిపూడి రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మోటార్సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్మోటార్ వెహికల్, ట్రాన్స్పోర్టు వెహికల్ నాలుగు విధానాల్లో మంజూరు చేసే విధంగా నిబంధనలు మార్పు చేశారు. 1. మోటార్ సైకిల్ వితౌట్ గేర్ 2.మోటార్ సైకిల్ విత్ గేర్ 3. లైట్ మోటార్ వెహికల్ ( ఈలైసెన్స్తో 7500 కిలోలు జీవీడబ్ల్యూ (గ్రాస్ వెహికల్ వెయిట్) వాహనం బరువు లోపు అన్ని త్రిచక్ర(ఆటోలు, గూడ్స్ ఆటోలు) నాలుగు చక్రాల వాహనాలు(కార్లు, సొంతవి, అద్దెవి, ట్రాన్స్పోర్టు, నాన్ట్రాన్స్పోర్టు, పాసింజర్, కమర్షియల్ టాటా మేజిక్ వంటి వాహనాలు) నడపవచ్చు. పైమూడు లైసెన్స్లు పొందేందుకు ఆధార్కార్డు ఉంటే చాలు. ఎటువంటి ధృవపత్రాలు అవసరంలేదు. (యాభై ఏళ్లు పైబడితే మెడికల్ సర్టిఫికెట్ ఇవాల్సి ఉంది. 4. ట్రాన్స్పోర్టు వెహికల్ లైసెన్స్: 7500 జీవీడబ్ల్యూ పైన ఉన్న పాసింజర్, గూడ్స్ వాహనాలన్నీ నడపవచ్చు. (లైసెన్స్ పొందేందుకు ఎనిమిదో తరగతి విద్యార్హత పొంది ఉండాలి). -
అజొల్లా తయారీ ఇలా..
బహుళ ప్రయోజనకారి.. ఖర్చు లేకుండా నాచు మొక్కల పెంపకం సులువుగా తయారీ విధానం.. వరికి ప్రాణం, పాడి పరిశ్రమకు ఊతం తయారీ విధానాలపై వ్యవసాయ అధికారి సలహా సూచనలు మిరుదొడ్డి: అజొల్లా.. నీటిలో తేలియాడే ఫెర్న్ జాతికి చెందిన నాచు మొక్క. వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించడం వల్ల ఈ నాచు మొక్కలు ఎక్కువ శాతం మాంసకృత్తులు కలిగిఉంటాయి. ఫలితంగా వరికి జీవ ఎరువుగా, పశువులకు మేతగా.. కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలకు దాణాగా ఉపయోగపడుతోంది. ఇంతటి లాభదాయకమైన అజొల్లాను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి ఎస్. నాగరాజు(సెల్: 72888 94461) తెలిపారు. అజొల్లా పెంచుకునే విధానంతో పాటు పాడిపశువులకు మేతగా ఎలా వినియోగించుకోవచ్చో ఆయన తెలిపిన వివరాలు.. అజొల్లా తయారీ విధానం అజొల్లా పెంపకానికి సూర్యరశ్మి తక్కువగా ప్రసరించే స్థలాలు లేదా ప్రత్యేకంగా తయారుచేసిన షెడ్లు ఎంచుకోవాలి. 2.5 మీ. పొడవు, 1.5 మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతులో గుంతలు తీసుకోవాలి. వాటిలో సమభాగంగా నీరు నింపుకోవాలి. వరిపొలాలు, నీటి కుంటలు, సిమెంటు తొట్టెల్లో కూడా అజొల్లాను పెంచుకోవచ్చు. వీటిలో అజొల్లా నారు వేసిన 7 నుంచి 10 రోజుల్లో నాచు మొక్కలు నీటిపై తేలుతూ సమభాగంలో పెరుగుతాయి. రోజుకొకసారి 20 గ్రాముల సూపర్ ఫాస్పేట్తో కొద్దిపాటి పశువుల పేడ నీటిలో కలిపితే మొక్కలు త్వరితగతిన పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన నాచు మొక్కలను రంధ్రాలు కలిగిన జల్లెడలో తీసుకుని మరో వరి పొలంలో వెసుకుంటే పెంపకానికి ఉపయోగపడుతుంది. తెగుళ్ల నివారణ అజొల్లాకు పురుగులు, తెగుళ్ల ఉదృతి తక్కువగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి అజొల్లా పెరుగుదల ఎక్కువైతే సహజంగా పురుగులు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. పురుగుల నివారణకు 5 మి.లీ. వేప నూనెకు ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలి. తెగుళ్ల నివారణకు సూడోమోన్పోరిసెన్స్ లేదా ట్రైకోడెర్మా విరిడిలను 100 గ్రాములు చొప్పున వాడాలి. దాణాగా అజొల్లా పొలంలో వేసిన అజొల్లా 7 నుంచి 10వ రోజు వరకు కిలో చొప్పున అభివృద్ధి చెందుతుంది. పెరిగిన అజొల్లా నాచు మొక్కలను రెండు కిలోల వరకు ఆరబెట్టి లేదా పచ్చిగా కానీ పాడి పశువులకు మేతగా వేసుకోవచ్చు. అజొల్లాను చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు మేతగా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. అజొల్లాను గొర్రెలు, మేకలు, బాతులు, కోళ్లు, చేపల దాణాలోనూ వినియోగించడం వల్ల మంచి లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. వరి సాగుకు ఊతం వరి సాగు చేసే రైతులకు అజొల్లా నాచు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయి. రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి.. పంటకు కావాల్సిన నత్రజననిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొద్దిపాటి నాచు మొక్కలను పొలంలో వేసుకుంటే 30 రోజుల్లో పొలమంతా వ్యాపిస్తుంది. ఈ తరుణంలో నాచు మొక్కలను పొలంలో కలియ దున్నుకోవాలి. ఇలా చేయడం వల్ల నాచు మొక్కలు పొలంలో కుళ్ళిపోయి వరికి కావాల్సిన నత్రజనిని పుష్కలంగా అందిస్తుంది. ఎలాంటి ఖర్చు, శ్రమ లేకుండా తగినంత స్థలంలో నాచు మొక్కల పెంపకాన్ని చేపడితే ఏడాది పొడవునా పాడి పశువులకు మంచి దాణాతో పాటు వరికి ఊత0 ఇచ్చినట్టు అవుతుంది. పోషక విలువలు మెండుగా.. నత్రజని: 5.0 శాతం మాంసకృత్తులు: 25 నుంచి 30 శాతం బాస్వరం: 0.5 శాతం కాల్షియం: 0.1 నుంచి 1.0 శాతం అమైనో ఆమ్లాలు: 10.0 శాతం ఇనుము: 0.26 శాతం పొటాషియం: 2.0 నుంచి 4.5 శాతం చక్కెర: 3.4 నుంచి 3.5 శాతం పిండిపదార్థం: 6.5 శాతం