భారతీయ నేవీకి ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్లను భారత్కు అమ్మేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్ నేవీ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే, సాంకేతిక అంశాలపై ఇంకా చర్చ జరగాల్సివుందని బోయింగ్ ఉపాధ్యక్షుడు సింగపూర్ ఎయిర్ షోలో పేర్కొన్నారు.
హార్నెట్ జెట్తో పాటు కేసీ-46 మల్టీరోల్ ట్యాంకర్ విమానాలను కూడా భారత్కు విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. గతేడాది భారతీయ నేవీ 57 ఫైటర్ జెట్లు, భారతీయ వాయుసేన 100 ఫైటర్ జెట్ల కొనుగోలు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బోయింగ్, సాబ్ ఏబీ జెట్ల తయారీ సంస్థలు భారత్కు ఫైటర్లను అమ్మేందుకు ఆసక్తిని చూపాయి. ఈ రెండు సంస్థలతో కొనుగోలు ఒప్పందం కుదిరితే ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఫైటర్ జెట్ల కొనుగోలు ఆర్డర్ అవుతుంది.