breaking news
FIDE World Cup
-
పోరాడి ఓడిన రాజా ర్వితిక్ , లలిత్ బాబు
పనాజీ: ప్రపంచకప్ పురుషుల చెస్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా ర్వితిక్... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబులకు నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు గ్రాండ్మాస్టర్లు తీవ్రంగా పోరాడినా... తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. నొగెర్బెక్ కాజీబెక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి రౌండ్లో రాజా ర్వితిక్ ‘టైబ్రేక్’లో 2–4తో... మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి రౌండ్లో లలిత్ బాబు ‘టైబ్రేక్’లో 2–4తో ఓడిపోయారు. ఆదివారం నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం ‘టైబ్రేక్’ గేమ్లు ఆడించారు. నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లు నిర్వహించారు. నొగెర్బెక్తో జరిగిన తొలి గేమ్లో రాజా ర్వితిక్ 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. అయితే రెండో గేమ్లో ర్వితిక్ 52 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో టైబ్రేక్లో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్లు ఆడించారు. తొలి గేమ్లో నొగెర్బెక్ 43 ఎత్తుల్లో గెలిచి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో గేమ్లో ర్వితిక్ 42 ఎత్తుల్లో గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడించారు. తొలి గేమ్లో ర్వితిక్ 71 ఎత్తుల్లో ఓడిపోయాడు. బరిలో నిలవాలంటే రెండో గేమ్లో ర్వితిక్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో గేమ్లో ర్వితిక్ 65 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దాంతో నొగెర్బెక్ టైబ్రేక్లో 4–2తో విజయాన్ని అందుకొని రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మరోవైపు వార్మెర్డామ్తో జరిగిన 15 నిమిషాల నిడివిగల టైబ్రేక్ తొలి గేమ్లో లలిత్బాబు 30 ఎత్తుల్లో నెగ్గాడు. రెండో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నా లలిత్ బాబు ముందంజ వేసేవాడు. కానీ రెండో గేమ్లో వార్మెర్డామ్ 40 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. ఇక 10 నిమిషాల నిడివిగల తొలి గేమ్లో వార్మెర్డామ్ 46 ఎత్తుల్లో నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే రెండో గేమ్లో లలిత్ బాబు 50 ఎత్తుల్లో గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. ఇక 5 నిమిషాల నిడివిగల తొలి గేమ్లో వార్మెర్డామ్ 47 ఎత్తుల్లో విజయం సాధించి 3–2తో ఆధిక్యాన్ని సంపాదించాడు. బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్లో లలిత్ బాబు 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. దాంతో వార్మెర్డామ్ 4–2తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ఎస్ఎల్ నారాయణన్, దీప్తాయాన్ ఘోష్ టైబ్రేక్ ర్యాపిడ్ గేముల్లో తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
ఫిడే ప్రపంచ కప్లో పాల్గోనున్న రాజా రిత్విక్
గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగాణకు చెందిన గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ పాల్గోనున్నాడు. రిత్విక్ మొదటి రౌండ్లో కజకిస్థాన్కు చెందిన నోగర్బెక్ కాజిబెక్తో తలపడనున్నాడు. . ఈ ఇద్దరు ఆటగాళ్లు నవంబర్ 1, 2 తేదీలలో రెండు క్లాసికల్ గేమ్లు ఆడతారు. ఒకవేళ రెండు రౌండ్ల తర్వాత పాయింట్లు సమానమైతే ఈ ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు నవంబర్ 3న రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టై-బ్రేక్ గేమ్లు ఆడనున్నారు.ఇక ప్రపంచ కప్లో పాల్గొనడం పట్ల రాజా రిత్విక్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్లోనే అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడనుండడం తన స్కిల్స్కు నిజమైన పరీక్ష అని రిత్విక్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 80 దేశాల నుంచి మొత్తం 208 మంది చెస్ ఆటగాళ్లు భాగం కానున్నారు. అయితే భారత్ నుంచి మొత్తం 24 మంది ప్లేయర్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్ చాంపియన్ గుకేశ్
ఫిడే ప్రపంచకప్-2025 (FIDE World Cup 2025) టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ మెగా చెస్ ఈవెంట్కు వేదిక కాగా.. గోవాలో అక్టోబరు 31- నవంబరు 27 వరకు టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఉత్తర గోవాలోని ఓ రిసార్టులో టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్ క్రీడాకారులు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్ ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో టాప్-3లో నిలిచిన వాళ్లు 2026 క్యాండిడేట్స్ ఈవెంట్కు అర్హత సాధించారు. విజేతకు ప్రైజ్మనీ 20,00,000 డాలర్లు.గోవాతో నాకెన్నో జ్ఞాపకాలుఈ నేపథ్యంలో వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ టోర్నీ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. స్వదేశంలో ఎక్కడ ఆడినా ఈ టోర్నీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.ముఖ్యంగా గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్ లెవల్ ఈవెంట్లలో ఆడాను’’ అంటూ ఈ టాప్ సీడ్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గుకేశ్ 2019లో గోవా వేదికగా ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. నాడు కేటగిరీ- ‘ఎ’ నుంచి పోటీపడిన గుకేశ్ పదో స్థానంతో ముగించాడు.ఫేవరెట్గా అనిశ్ గిరి కూడా..అయితే, ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గుకేశ్ బరిలోకి దిగనుండటం విశేషం. ఇక గుకేశ్తో పాటు.. నేపాల్ సంతతికి చెందిన డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరినీ టోర్నీలో ఫేవరెట్గా పోటీలో నిలిచాడు. ఇప్పటికే అతడు ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్-2025కి అర్హత సాధించాడు. కాగా 2005 నుంచి నాకౌట్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఫిడే వరల్డ్కప్ టోర్నీలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో పాటు అర్మేనియాకు చెందిన లెవాన్ ఆరోనియన్ మాత్రమే రెండుసార్లు టైటిల్ గెలవగలిగారు.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!


