హరిత తెలంగాణకు కృషి చేయాలి: కేసీఆర్
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో ఆయన శుక్రవారం కదంబం మొక్కను నాటారు. గుండ్రాంపల్లి గ్రామంలో వేపమొక్కను నాటి రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో నల్లగొండ జిల్లా అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. నాటిన ప్రతిమొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవుల విస్తీర్ణం పెంచితే వర్షాలు సంవృద్ధిగా పడతాయన్నారు. అడ్డగోలుగా అడవులు నాశనం చేయటం వల్లే కరువు ఏర్పడిందన్నారు. హరిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మిషన్ కాకతీయతో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఇక విద్యుత్ కోతలు ఉండవని తెలిపారు. కాగా హరితహారం కార్యక్రమాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించారు. గుండ్రాంపల్లి నుంచి కోదాడ వరకూ ఏరియల్ సర్వే చేపట్టిన ఆయన వర్షం కారణంగా నార్కెట్పల్లి వరకూ మాత్రమే సర్వే చేసి వెనుదిరిగారు. హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి జగదీష్రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.